Library | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రంథాలయాలు పోటీ పరీక్షలకే కాదు.. నైపుణ్య శిక్షణకు నిలయాలుగా మారనున్నాయి. ఇప్పటివరకు దినపత్రికలు, పుస్తకాలతో నిండిన లైబ్రరీలు.. ఇక నుంచి స్కిల్ డెవలప్మెంట్ తర్ఫీదుతో నిత్యం కళకళలాడనున్నాయి. ఈ దిశగా అన్ని గ్రంథాలయాల్లో డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్ గ్రంథాలయాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు. తాజాగా రాష్ట్రంలోని మరో 20 గ్రంథాలయాల్లో ఈ సెంటర్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. జూన్ కల్లా రంగారెడ్డి (బడంగ్పేట) సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాలతో పాటు దేవరకొండ, బెల్లంపల్లి శాఖ గ్రంథాలయాల్లో డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటుచేయనున్నారు.
ఇవి పూర్తయ్యాక 33 జిల్లాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. వీటి ఏర్పాటుకు గతంలోనే డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్తో అధికారులు మూడేండ్ల పాటు ఎంవోయూను కుదుర్చుకొన్నారు. ఈ ఒప్పందంలో టాస్క్, డైరెక్టర్ ప్రజాగ్రంథాలయాలు, వీహబ్ వంటి సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. ఈ డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లలో టాస్క్ ద్వారా మహిళలు, యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఓటర్ ఐడీ, ఆధార్, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటికి దరఖాస్తు చేసుకొనే సౌలభ్యం కల్పిస్తారు. డిజిటల్ చెల్లింపులపైనా అవగాహన కల్పిస్తారు. ఈ సేవలు ఉచితంగా లభిస్తాయి.
పలు అంశాల్లో నైపుణ్య శిక్షణ
జూన్లో ఐదు ప్రారంభం
సీఎం కేసీఆర్ ఆదేశాలు, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి మార్గదర్శనంలో గ్రంథాలయాలు పురోగమన దిశలో పయనిస్తున్నాయి. గత తొమ్మిదేండ్ల కాలం గ్రంథాలయాలకు మహర్దశగా చెప్పుకోవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, శిక్షణ ఇవ్వడంలో భాగంగానే డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే మూడు సెంటర్లను అందుబాటులో తెచ్చాం. ఇవి విజయవంతంగా సేవలందిస్తున్నాయి. జూన్లో ఐదు సెంటర్లను ప్రారంభిస్తాం. మొత్తం 20 గ్రంథాలయాలకు ఈ సేవలను విస్తరిస్తాం. ఆ తర్వాత 33 జిల్లాల్లో ఇవి ఏర్పాటవుతాయి. విద్యార్థులు మొదలుకొని అన్ని వయస్సుల వారు ఈ సెంటర్లను వినియోగించుకోవచ్చు.
– డాక్టర్ అయాచితం శ్రీధర్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్