Congress | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్కు ఓటేస్తే ‘గ్రామ సభ’ రూపంలో రైతు తలపై మరో పిడుగు పడనున్నది. సీఎం కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ‘రైతుకు కొత్త భర్త’ రానున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల రికార్డుల మీద అధికారం అధికారుల చేతుల్లో ఉండేది. అది కూడా ఏ ఒక్కరికో కాదు.. గ్రామస్థాయిలో వీఆర్వోతో మొదలుపెడితే.. ఆర్ఐ, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్ఏ, రెవెన్యూ కార్యదర్శి, రెవెన్యూ మంత్రి.. ఇట్లా రాష్ట్రంలోని ప్రతి గుంట పొలం మీద 8 మందికి అధికారం ఉన్న పరిస్థితి. సీఎం కేసీఆర్ పరిభాషలో చెప్పాలంటే ‘ప్రతి రైతుకు 8 మంది భర్తలు’ ఉండేవాళ్లు.
వాళ్లకు ఎదురుపడి నమస్కారం పెట్టకపోయినా, ఎదురు మాట్లాడినా.. పక్కోడో, పాలోడో, ఇంటోడో లంచం ఇచ్చినా, నాయకులు బెదిరించినా తెల్లారేసరికి రికార్డు మారిపోయేది. పదెకరాల రైతు కూడా తెల్లారేసరికి కూలీగా మారిపోయిన ఘటనలు వేలల్లో. పట్టాను తిరిగి తమ పేరుమీదికి మార్చాలంటూ వీఆర్వో నుంచి రెవెన్యూ మంత్రి వరకు అందరి చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మళ్లీ కొత్తగా కౌలురైతులకు చట్టపరంగా హక్కులు కల్పిస్తామని, రైతులు, కౌలు రైతులు ఒప్పందం చేసుకోవాలని, గ్రామ సభ దీనిని ఆమోదించాలని కాంగ్రెస్ అంటున్నది. దీంతో రైతుపై కొత్తగా మరో వ్యవస్థ పెత్తనం చెలాయించనున్నది. కేసీఆర్ మాట్లలో చెప్పాలంటే ‘రైతుకు తొమ్మిదో భర్త’ వస్తాడు. మరోవైపు ఇప్పటివరకు రైతుబంధు అత్యంత పారదర్శకంగా సాగుతున్నది. కొత్త నిబంధనలతో విచ్చలవిడి అవినీతికి పాల్పడే అవకాశం కలగనున్నది. గ్రామస్థాయి అధికారులు లంచాలు, కమీషన్లు అడిగే పరిస్థితి వస్తుంది.