Ostracism | ఖిలావరంగల్, ఏప్రిల్ 16: గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంటలో ఆర్థిక పంచాయితీ వివాదంలో ఓ కుటుంబాన్ని కుల పెద్దలు వెలేశారు. దీంతో రెండు నెలలుగా మనోవేదనకు గురైన ఆ ఇంటి యజమాని ఆదివారం మృతి చెందాడు. అతని అంత్యక్రియలకు హాజరైతే రూ.10 వేలు జరిమానా విధిస్తామని కుల పెద్దలు హుకుం జారీ చేయడంతో మృతుడి కులానికి చెందినవారు ఎవరూ వెళ్లలేదు. దీంతో గ్రామంలోని సబ్బండ వర్ణాల ప్రజలు ముందుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదిరాజ్ కులానికి చెందిన బొజ్జ మల్లయ్య (74) కుల సంఘంలో ప్రతి నెలా డబ్బులు కడుతాడు. కరోనా సమయంలో సంఘంలో పనిచేసే కోశాధికారి 8 మంది పేర్లతో రూ.8 లక్షలు వాడుకొని పారిపోయాడు. కోశాధికారి డబ్బులు ఎత్తుకెళ్తే తాము ఎందుకు కట్టాలని మల్లయ్య, అతని కుమారుడు నిలదీశారు. దీంతో కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మల్లయ్య కుటుంబాన్ని ఇటీవల కులం నుంచి బహిష్కరించారు.
ఫలితంగా మానసిక ఆందోళనకు గురైన మల్లయ్య ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి కులపోళ్లు ఎవరైనా అంత్యక్రియల్లో పాల్గొంటే రూ.10 వేలు జరిమానా విధిస్తామని సదరు కుల పెద్దలు హెచ్చరించడంతో అందరూ అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు. చివరికి బొల్లికుంటలోని ముదిరాజ్ కులస్థులు మినహాయించి సబ్బండ వర్ణాల ప్రజలు మల్లయ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.