Dharmapuri Arvind |కమ్మర్పల్లి, ఫిబ్రవరి 27: బీజేపీకి ఓటు వేయకుంటే నరకానికి పోతారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన భీమ్ విజయ్ సంకల్ప యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి అర్వింద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు మోదీ ప్రభుత్వం రుణాలిస్తుందని, ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. బీజేపీ పెట్టిన తిండి తిని ఓటు వేయని వారు నరకానికి పోతారని అన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘రాహుల్ ప్రధాని అయ్యేది లేదు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేది లేదు’ అని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.