బంజారాహిల్స్, అక్టోబర్ 5: ఆస్ట్రేలియా వెళ్తున్నానని తండ్రికి మెసేజ్ పెట్టి అదృశ్యమైన యువతి కేసును ఫిలింనగర్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. షేక్పేట సమీపంలోని సబ్జా కాలనీకి చెందిన మాహియా తరన్నుమ్(24) డీ-ఫార్మసీ పూర్తిచేసి సోమాజిగూడలోని యశోదా దవాఖానలో పదిరోజులుగా ట్రైనింగ్ కోసం వెళ్తున్నది. మంగళవారం ఉదయం ఇంట్లోంచి వెళ్లిన మాహియా.. మద్యాహ్నం 3గంటల ప్రాంతంలో ‘నేను ఆస్ట్రేలియా వెళ్తున్నా. నా కోసం వెతకొద్దు’ అని తండ్రి గఫార్కు వాట్సాప్ చేసింది. దీంతో ఆందోళన చెందిన అతడు దవాఖానలో వాకబు చేశాడు. అయితే తరన్నుమ్ రాలేదని తేలింది.
అన్ని ప్రాంతాల్లో గాలించినా లాభం లేకపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీలు, సెల్ఫోన్ కాల్డాటా ఆధారంగా తరన్నుమ్ తన స్నేహితుడు బీహార్కు చెందిన నదీమ్తో కలిసి వెళ్లినట్టు తేలింది. దాంతో బీహార్ పోలీసులను అప్రమత్తం చేసి, శంషాబాద్ ఎయిర్పోర్టులో సమాచారం ఇచ్చారు. నదీమ్ స్నేహితుల ఫోన్ నంబర్లు సంపాదించిన ఫిలింనగర్ పోలీసులు వారిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. నదీమ్, తరన్నుమ్ 8 నెలల కిందటే రహస్యంగా పెండ్లి చేసుకున్నారని తెలిసింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల వివరాలు వడపోసి తరన్నుమ్, నదీమ్ యూకే వెళ్లినట్టు గుర్తించారు.
స్నేహితులు ఇచ్చిన సెల్ఫోన్ నంబర్లు, ఇతర వివరాలతో నదీమ్కు కాల్ చేయటంతో.. తాము జనవరిలోనే పెండ్లి చేసుకున్నామని, కుటుంబసభ్యులకు చెప్తే పెండ్లికి ఒప్పుకోలేదని తెలిపాడు. మాస్టర్స్ చేసేందుకు బ్రిటన్ వచ్చామని వారిద్దరు వీడియో రికార్డింగ్ పంపించారు. బ్రిటన్లో ఉన్నట్టు తెలియజేసే ఆధారాలు, లొకేషన్, మ్యారేజ్ సర్టిఫికెట్ పంపటంతో కథ సుఖాంతం అయ్యింది. పోలీసులు యువతి తండ్రిని పిలిచి జరిగిన విషయం చెప్పి, కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండ్రోజుల్లోనే యువతి అదృశ్యం కేసును ఛేదించిన ఫిలింనగర్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.