హైదరాబాద్ : బొగ్గు కుంభకోణం( Coal Scam ) విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో నైనీ టెండర్ రద్దు చేశారంటే, స్కాం జరిగినట్లేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు (Harish Rao) ఆరోపించారు. శనివారం హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. నైనీ వ్యవహారంలో మంత్రి భట్టి మసిబూసి మారేడు కాయ చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో సోలార్ స్కాం చేసిన ఆరోపణలపై మౌనం ఎందుకు వహిస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి బావమరిది కోసమే ఈ తతంగమంతానని విమర్శించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నైనీ టెండర్ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి, మసిబూసి మారేడు కాయ చేసారు. మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం. అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్ గా పాత్ర పోషించింది నిజం. నేను సూటిగా అడుగుతున్నా. ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారు?
నిన్న బయటపెట్టిన మరో కుంభకోణం.. సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాట కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడలేదని నిలదీశారు. నైనీని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదు? సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బిఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్దాలు అయిపోవు. జరిగిన స్కాంలు, స్కీంలుగా మారిపోవని స్పష్టం చేశారు.
రేవంత్రెడ్డి, బావమరిది కుంభకోణంపై విచారణకు హామీ ఇస్తే లేఖ రాస్తా
సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారు? అది తప్పు కాకుంటే నైనీ ఎందుకు రద్దు చేసినట్లు? ఇదే సైట్ విజిట్ విధానం సింగరేణిలో కూడా అమలు చేసామని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలని అన్నారు.
భట్టి గారూ. మీరంటే నాకు చాలా గౌరవం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జీ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ మాత్రమే చేయగలవు అన్న ఉద్దేశ్యంతోనే లేఖ రాసాను. మీరు నిజంగా రేవంత్ రెడ్డి, అతని బావమరిది కుంభకోణం మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాను అని హామీ ఇస్తే మీకూ లేఖ రాయడానికి సిద్దమని హరీష్రావు స్పష్టం చేశారు.