Etela Rajender | భీమదేవరపల్లి : అధిష్టానం అవకాశం ఇస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు వృక్షప్రసాదం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిందని గుర్తు చేశారు. అవకాశం వస్తే తప్పక కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాల వల్ల ఇతరులకు హాని కలుగవద్దని అభిప్రాయపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గంలో ప్రభుత్వం సహాయం చేయాలని సూచించారు.