Telangana | ఎట్లుండే తెలంగాణ.. ఎట్లయ్యింది నేడు? రాష్ట్రం ఏర్పడకముందు భూముల విలువ ఎట్లుండే? బీడు, పడావుపడ్డ భూములను ఎవరన్నా పట్టించుకున్నరా? వేలు, లక్ష లోపే ధరలుండేవి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ఎంతో మార్పు. ఇప్పుడు పడావు, బీడు భూములు ఎక్కడన్నా కనపడుతున్నాయా? అసలు భూముల ధరల్లో ఎంత తేడా వచ్చింది. పదేండ్లలో ఇరవై రెట్లకు పైగా భూముల విలువ పెరగలేదా? ఆపత్కాలంలో మనల్ని ఆదుకుంటుందనే ధీమా భూమి యజమానుల్లో పెరగలేదా?
అందుకు ప్రధాన కారణం.. దండగ అనుకున్న సాగును పండుగలా మార్చేందుకు కేసీఆర్ చేపట్టిన పథకాలే. 24 గంటల కరెంటు, పుష్కలంగా సాగు నీరు, రైతు బంధు, రైతుబీమా.. ఇలా ఎన్నో చర్యలతో బీళ్లుగా ఉన్న భూములన్నీ సాగులోకి వచ్చాయి. భూముల విలువ పెరిగింది. దానితోపాటు ప్రజల్లో భరోసా పెరిగింది. ప్రజలు గుండెలపై చేతులేసుకుని నిశ్చింతగా నిద్రపోతున్న వేళ.. మళ్లీ మేమున్నామని కాంగ్రెస్ వాళ్లు వచ్చిన్రు. ఒక్క అవకాశమంటూ మభ్యపెడుతున్నరు. ఆదమరిచి వారికి ఓటు గనుక వేస్తే మన భూముల విలువంతా ఢాం అని పేలిపోతది. తస్మాత్ జాగ్రత్త.
ఊరుచివర మారుమూల ఉన్న ఎకరా భూమి కూడా ఇప్పుడు రూ.50 లక్షల ధర పలుకుతుంది కదా! రేపు, అదే భూమి రూ.50 వేల విలువ కూడా చేయకపోతే? ఏం జేస్తరు?? ఏంది గట్ల మాట్లాడుతరు అంటున్రా??
‘ఒక్క చాన్స్’ అంటూ ఉరికొస్తున్న కాంగ్రెస్ వాళ్లను నమ్మి ఓటేస్తే.. అదే జరుగుతది. మన భూముల విలువ ఢామ్మని పేలిపోతది. కాంగ్రెస్ పాలనలో మన భూముల విలువేందో ఓ సారి యాది జేస్కోండి! మీకే సమజైతది.
అంతేకాదు, ఎవుసానికి మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ తన పేటెంట్, తాను రియల్ ఎస్టేట్ వ్యాపారినని బాహాటంగానే ప్రకటించాడు.
అలాంటి కాంగ్రెస్కు ఆదమరిచి ఓటేశామా?? మన భూముల విలువ పడిపోతది. ఉన్న ఆ కొద్దిభూములు కూడా రాబందుల పాలైతయ్.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): వస్తువైనా, మరేదైనా.. డిమాండ్ ఉన్నప్పుడు సైప్లె తగ్గిపోతే.. దాని ధర/విలువ పెరుగుతుంది. ఇది ఆర్థిక శాస్త్రంలో ఒక సూత్రం. ఇదే సూత్రం భూములకు కూడా వర్తిస్తుంది. భూమి ఎన్నటికైనా పెరగదు. ఎంతున్నదో అంతే ఉంటుంది. కానీ జనాభా మాత్రం ఏటికేడు పెరుగుతూనే ఉన్నది. ప్రజల కొనుగోలు శక్తి, భూములను ఉపయోగించే క్రమాన్ని అనుసరిస్తూ.. ఈ భూముల ధరలు పెరుగుతూ ఉంటాయి.
తెలంగాణ ఏర్పడక ముందు భూముల విలువ చాలా తక్కువగా ఉండేది. రూ. లక్షకు అటూ ఇటూగా ఎకరం భూమి దొరికేది. ఇక ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లోనైతే రూ.వేలల్లోనే భూమి లభించేది. రాష్ట్రం ఏర్పడకముందు.. బీడు భూములు, పడావు పడ్డ భూములే అధికంగా ఉండేవి. వ్యవసాయం చాలా తక్కువ విస్తీర్ణంలో జరిగేది. వానకాలం, యాసంగి కలిపి కేవలం 1.20 కోట్ల ఎకరాల్లోనే అరకొర వ్యవసాయం సాగేది. వ్యవసాయానికి సరిపోయినంత విద్యుత్తు ఇవ్వకుండా.. 7 గంటల విద్యుత్తు అని చెబుతూ.. నాలుగైదు విడతల్లో ముక్కుతూ, మూలుగుతూ విద్యుత్తు సరఫరా చేసేవారు. పైగా రైతులకు ఎలాంటి పెట్టుబడి సాయం ఉండేది కాదు. అప్పులు తీసుకుని పంటలను సాగు చేసేవారు. ఇటు విద్యుత్తు లేక.. అటు సాగునీరు అందక.. పంటల దిగుబడిరాక.. అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నల దీనగాథలు ఎన్నెన్నో ఉన్నాయి. దీనితో రైతన్నలు వలస వెళ్లి కూలి పనులు చేసుకునేవారు. రాష్ట్రంలో మొత్తం బీడు భూములే కనపడేవి. పాలమూరు వలసల జిల్లాగా అందుకే పేరుగాంచింది. ఇలాంటి దయనీయమైన పరిస్థితులు నెలకొన్నందునే.. అప్పట్లో వ్యవసాయ భూముల ధరలు చాలా తక్కువగా ఉండేవి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే.. అభివృద్ధికి మొదటి అడుగు వేసింది విద్యుత్తు విషయంలోనే. ముందుగా వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును పునరుద్ధరించారు. అటు తరువాత.. విద్యుత్తు వ్యవస్థలను బలోపేతం చేసి.. 2018 జనవరి ఒకటి నుంచి సాగుకు 24 గంటలు నిరంతరాయంగా పూర్తి ఉచిత విద్యుత్తును ఇస్తున్నారు. జలవనరులను పునరుద్దరించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించి రాష్ట్రవ్యాప్తంగా సాగునీటికి ఢోకా లేని పరిస్థితిని సృష్టించారు. అది వానకాలం అయినా.. యాసంగి అయినా.. పంటలకు పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి రావడంతో.. బీడు భూములన్నీ సాగవ్వడం మొదలయ్యింది. వలస వెళ్లిన యజమానులు, రైతు కూలీలు తమ సొంతూళ్ల్లకు తరలి వచ్చారు. రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయం బాగుపడటంతో ఇప్పుడు ఏకంగా బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ర్టాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారంటే పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు.
సొంత రాష్ట్రం ఏర్పడకముందు ఉన్న దయనీయ పరిస్థితులన్నీ ప్రత్యేక రాష్ట్రంలో మారిపోయాయి. భూములకు డిమాండ్ పెరిగింది. కొనేవారు ఎక్కువయ్యారు. భూములను అమ్మేవారు తగ్గిపోయారు. డిమాండ్.. సైప్లెల మధ్య తేడా తీవ్రమయ్యింది. దీంతో భూముల విలువ పెరిగింది. ఏదన్నా అత్యవసరం అయితే, కుటుంబ అవసరాలకు ఉన్నదాంట్లో ఎంతో కొంత భూమి అమ్మడం తప్పితే.. ఉన్న భూమంతా అమ్ముకోవడం అనేది లేదిప్పుడు. అందుకే భూముల విలువ మరింతగా పెరిగింది. గడిచిన పదేండ్లలో భూముల ధరలు సగటున ఇరవై రెట్లు పెరిగాయనే చెప్పవచ్చు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డిలాంటి నగరాలు, పట్టణాల్లో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. కంపెనీలు, పెట్టుబడులు వెల్లువలా రావడంతో రియల్ఎస్టేట్ గణనీయంగా పుంజుకున్నది.
యాభై ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయాన్ని దండగలా మార్చింది. మరోసారి అదే కాంగ్రెస్కు ఓటేస్తే ఇప్పటివరకూ సాధించిన అభివృద్ధి, సంక్షేమం అటకెక్కుతుంది. వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటుంది. భూముల విలువ మళ్లీ ‘ఢాం’అని పేలుతుంది. వ్యవసాయ భూముల ధరలుకూడా తల్లకిందులవుతాయి. వాటి విలువ పడిపోతుంది. ఆపత్కాలంలో ఆదుకుంటాయని భావిస్తున్న మన వ్యవసాయ భూములు అతి తక్కువ ధరకే తెగనమ్మాల్సి వస్తుంది. రేవంత్ చేతుల్లో మన భూములు భద్రంగా ఉంటాయని అనుకోగలమా? కాంగ్రెస్కు ఓటేస్తే, భూములను అగ్గువసగ్గువకు తెగనమ్ముకోవడమో, లేక ఉచితార్ధంగా కోల్పోవడమో జరుగొచ్చు. జర పైలం!!