Bandi Sanjay | వరంగల్ : టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్( Bandi Sanjay ) నిర్దోషి అయితే ఫోన్ ఎందుకు దాచుకున్నారు..? తమకు ఎందుకు ఇవ్వట్లేదు అని వరంగల్ సీపీ రంగనాథ్( CP Ranganath ) ప్రశ్నించారు. సంజయ్ను జడ్జి ఎదుట ప్రవేశపెట్టిన అనంతరం రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.
పేపర్ లీకేజీ వ్యవహారంలో సంజయ్ పాత్ర లేకపోతే ఫోన్ దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది..? ఆయన ఫోన్ ఇస్తే కీలక సమాచారం బయటకు వస్తుంది. ఫోన్ ఎందుకు తేలేదు..? ఆ ఫోన్ తెస్తే అంతా బయటపడుతుంది. నాకేం సంబంధం లేదు.. నన్ను అరెస్టు ఎలా చేస్తారు అని ఫోన్ ఇస్తే ఎవరు ఏంటనేది తేలిపోయేది కదా అని రంగనాథ్ ప్రశ్నించారు. కానీ అది చేయలేదు. ఒకట్రెండు రోజుల్లో డేటా తీసుకుంటాం. వాట్సాప్ వారికి కూడా రెక్వెస్ట్ పంపుతాం. వాట్సాప్ చాట్ను రీట్రీవ్ చేస్తామని సీపీ చెప్పారు.
కక్షపూరితంగా బండి సంజయ్ను ఇరికించారనేది అవాస్తవం అని స్పష్టం చేశారు. గవర్నమెంట్ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం జరిగింది అని సీపీ పేర్కొన్నారు. వాట్సాప్లో చాట్ జరిగిందే మరుసటి రోజు పేపర్లలో కథనాలు వవచ్చాయి. కుట్రపూరితంగా బండి సంజయ్ను ఇరికించలేదు. ఈటల రాజేందర్కు కూడా ఫార్వార్డ్ చేశారు. ఆయనతో పాటు బీజేపీ వారికి చాలా మందికి ఫార్వార్డ్ అయింది పేపర్. మరి వారందరిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు అని ప్రశ్నించారు. తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు సంజయ్ను ఏ1గా చేర్చామని సీపీ స్పష్టం చేశారు.
మంగళవారం ఉదయం 9:30 గంటలకే పేపర్ లీకైనట్లు బండి సంజయ్, ప్రశాంత్ మధ్య వాట్సాప్ చాట్ జరిగింది. ఆ ప్రశ్నపత్రాన్ని ఫోటోగ్రాఫ్ చేసింది 9:45కి. మీడియాకు ఉదయం 10:45 గంటల మధ్యలో వచ్చింది. విచారణలో భాగంగా కాల్ డేటాను కూడా పరిశీలిస్తాం. అప్పుడు చాలా విషయాలు బయటకు వస్తాయి. చాలా వరకు చాట్స్ను డిలీట్ చేశారు. అవన్నీ రిట్రీవ్ చేస్తామని సీపీ రంగనాథ్ చెప్పారు.