ములుగు : గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం పరిసరాల్లో 13వ శతాబ్దం నాటి పురాతన శిల్పంను తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. ఆ విగ్రహాలు కాకతీయుల కాలం నాటివని బృందం పేర్కొంది. ఈ సందర్భంగా బృందం సభ్యుడు అహోబిలం కరుణాకర్ మాట్లాడుతూ కాకతీయ వారసత్వ పరిరక్షణలో భాగంగా ములుగు ప్రాంత పరిసరాల్లో తనతో పాటు బృందం సభ్యులు మహ్మద్ నసిరోద్దీన్, కొరివి గోపాల్, మహ్మద్ అన్వర్భాష సర్వే చేపట్టినట్లు తెలిపారు.
మొద్దులగూడెం గ్రామ పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడి ఉన్న శిల్పంను పరిశీలించగా.. అవి 13వ శతాబ్దానికి చెందిన వేణుగోపాల సత్యభామ శిల్పంగా గుర్తించినట్లు తెలిపారు. కాకతీయుల కాలంలో ఏవో అవాంతరాల కారణంగా శిల్పాలు అసంపూర్తిగా చెక్కబడి ఉన్నాయని ఆయన తెలిపారు. గుర్తించిన శిల్పాలను పరిరక్షించాలని మొద్దులగూడెం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.