హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): మారుతున్నపర్యావరణ పరిస్థితుల దృష్ట్యా వరికి చిరుధాన్యాల పంటలే ప్రత్యామ్నాయమని ఇక్రిసాట్ తేల్చింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార అవసరాలను తీర్చగలిగే ప్రత్యామ్నాయ పంట ఉత్పత్తులూ చిరుధాన్యాలేనని ఇక్రిసాట్ పరిశోధకులు వెల్లడించారు. పర్యావరణ మార్పుల కారణంగా వరి ధాన్యం దిగుమతిపై ప్రభావం పడుతున్నది.
దీంతో ఆహారపు ఉత్పత్తి కొరత ఏర్పడుతుండగా, ఆహార భద్రతకూ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది. పెరుగుతున్న నిర్వహణభారం కారణంగా ప్రస్తుతం వరి సాగుబడి తగ్గుతూనే ఉన్నది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు కూడా పంట దిగుబడి తగ్గుదలకు మరో ప్రధాన కారణం. చిరుధాన్యాల పంటలపై చీడపీడల ప్రభావం ఏమాత్రం లేకుండా దిగుబడిని పొందవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీంతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం ఎక్కువగా ఉండటం, తక్కువ నిర్వహణ ఖర్చులు, పంటకాలం, నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితుల్లోనూ ఏమాత్రం దిగుబడి తగ్గకుండా ఉండే లక్షణాలు చిరుధాన్యాలకు ఉండటమే వరికి ప్రత్యామ్నాయ పంటగా భావించడానికి కారణమని వారు చెప్తున్నారు.