హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని ఐఏఎస్ అధికారులకు సెప్టెంబర్ నెల వేతనం ఇప్పటి వరకు అందలేదు. ఈ నెల 5వ తేదీ దాటినా సర్కారు జీతాలు ఇవ్వలేదు. దీంతో ఐఏఎస్లు గుర్రుగా ఉన్నారు. గడిచిన కొన్ని నెలల్లో ఐఏఎస్లకు రాష్ట్రప్రభుత్వం 20వ తేదీ వరకూ వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొన్నదని ఐఏఎస్ అధికారులు పేర్కొంటున్నారు.
కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించాల్సిన వేతనాలు ఏపీలో నిలిపి వేయడంపై ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడుతున్నారు. ఈ విషయమై ఐఏఎస్ అధికారులు కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఐఏఎస్ అధికారులతో పాటు చాలా విభాగాల ఉద్యోగులు, టీచర్లకూ సెప్టెంబర్ నెల వేతనాలు ఇంకా అందలేదు.