KCR | తెలంగాణకు అన్యాయం జరిగితే తన చివరి వరకు, తన కట్టె కాలే వరకు పులిలాలేచి కొట్టాడుతానని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఛలో నల్లగొండ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడితే మీరూ విన్నరు. ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండేనట ఆయనకు. ఉమ్మడి రాష్ట్రమే మంచిగుండే.. ఇప్పుడు మంచిగలేదట. శ్రీకాంత చారి ఎందుకు చనిపోయిండు. ఇదే జిల్లాలో ఉన్న బిడ్డ. ఉద్యమకారులు ఎందుకు చనిపోయారు ? అంతపెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది ? లక్షలు, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నరు ? ఇంత సోయితప్పి మంత్రులు మాట్లాడుతున్నరు’ అంటూ విమర్శించారు.
‘గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి.. పోయి భద్రప్పల్లాగా సంతకాలు పెట్టారు. మెమోరాండం దొరికింది. నీళ్ల మంత్రిగా పని చేసింది కాబట్టి.. అనుభవం ఉంది కాబట్టి.. నష్టం ఎంత వస్తదో తెలుసుకాబట్టి వెంటనే హరీశ్రావు గర్జించిండు. గర్జిస్తే నాలుగైదు రోజులు నాటకాలు ఆడారు. అబద్ధాలు మాట్లాడారు. మొన్న నిలబెట్టి అసెంబ్లీలో గట్టిగ అడిగితే.. బడ్జెట్ అతిముఖ్యమైన విషయం. చరిత్రలో ఎప్పుడూ పక్కకుపెట్టి వేరే అంశాలు తీసుకోరు. మిమ్మల్ని బజారున నిలబెడుతామని.. ప్రజల ముందే తేల్చుకుంటామని నేను ఛలో నల్లగొండ అని పిలుపునిచ్చిన. నాకు చాతనైనా కాకపోయినా.. నా కట్టేకాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలాగా లేచి కొట్లాడుత తప్ప పిల్లిలాగ ఉండను. ఎట్టి పరిస్థితుల్లో ఆరునూరైనా ఏ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగనివ్వను.. కొట్లాడుదాం’ అన్నారు.
‘ఛలో నల్లగొండకు పిలుపునివ్వంగానే ఇక పీక్కపీక్కసచ్చుడు. ఇజ్జత్ మానం పోతదిరబై ఆ కాడ కేసీఆర్ అక్కడ బొబ్బపెడితే.. ఏం చేద్దాం చేద్దామని చేతులు పిసుక్కొని.. కాళ్లు పిసుక్కొని.. అర్జెంట్గా బడ్జెట్ను పక్కనపెట్టి.. శాసనసభలో తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం కూడా సక్కలేదు. వాళ్ల తెలివితెల్లారా.. సాగునీళ్లు, తాగునీళ్లు అని పెట్టిన్రు. కరెంటు ఉత్పత్తి పెట్టలేదు తీర్మానంలో కూడా. అంత తెలివితక్కువ తీర్మానం. అది పెట్టి మమ అనిపించుకున్నరు. వాళ్లది ఏం పోతుంది. వాళ్లకు కావాలే పదవులు, పైరవీలు, డబ్బులు తప్ప ప్రజలకు హక్కుల గురించి లేదు. నాడు లేదు. నేడు లేదు. దయచేసి నేను కోరేది ఒకటే. అన్ని సందర్భాల్లో పోరాటమే ఉండదు. అవసరమైనప్పుడు పోరాడాలి. పోరాటానికి సిద్ధంగా ఉండాలి. అవసరమైతే సద్దులుకట్టుకొని రావాలి. మనం పిడికిలి బిగించాలి. అప్పుడే హక్కులు కాపాడగలుగుతాం’ అంటూ పిలుపునిచ్చారు.
‘అటు కేంద్రాన్ని కానీ.. అధికారులను గానీ.. కృష్ణా ట్రిబ్యునల్ గానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని భద్రప్ప పని చేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు గానీ నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలి. ఈ మాట చెప్పేందుకే నేను ఇంత దూరం వచ్చిన. మిమ్మల్ని సమీకరించిన. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. వచ్చిననాటి నుంచి మీరు చూస్తున్నరు. కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి. పోయిన గవర్నమెంట్ కంటే నాలుగు మంచి పనులు చేస్తాం. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? పొద్దున లేస్తే సొల్లుపురాణం.. కేసీఆర్ను తిట్టాలే.
కేసీఆర్ను తిడితే మీరు పెద్దొళ్లు అవుతరా? కేసీఆర్ మీద బదనాం పెడితే పెద్దోళ్లు అవుతరా? ప్రజల హక్కులు గాలికొదిలేసి ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నరో.. దుర్భాషలాడుతున్నరో.. దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడుతున్నరో టీవీల సాక్షిగా చూస్తున్నరు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. కానీ, తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం. మన వాటా శాశ్వతం. మన బతుకులు నిజం. మన పిల్లల భవిష్యత్ నిజం. దాని కోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడి రాష్ట్రం తెచ్చినం కాబట్టి.. బీఆర్ఎస్ సైనికులు కూడా అప్రమత్తంగా ఉండాలి.. మన పోరాటం కొనసాగుతూ ఉండాలి. ఆ విధంగా ముందుకెళ్లాలి’ అంటూ కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.