హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మనుగడపై మంత్రి వివేక్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఓడిపోతుందని, తానూ ఓడిపోతానని బాంబు పేల్చారు. ప్రభుత్వం ఐదేండ్లు ఉంటుందని గ్యారెంటీ ఇవ్వలేనని, ఇక తన మాటలతో ఫాయిదా ఏందని తనను కలిసేందుకు వచ్చిన పాలిటెక్నిక్ విద్యార్థులతో స్వయంగా మంత్రి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. జీవో97 రద్దును డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న విద్యార్థులను సముదాయించడంలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం మాసాబ్ట్యాంక్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఓ విద్యార్థి ‘స్కిల్ యూనివర్సిటీ నుంచి ఇన్వెస్టర్లు వెళ్లిపోరన్న గ్యారెంటీ ఇవ్వండి..? అంటూ మంత్రిని ప్రశ్నించారు. దీంతో కల్పించుకున్న మంత్రి రేపు ‘నేను ఓడిపోతా.. ? గవర్నమెంట్ పోతది.. అంటూ ఎదురు ప్రశ్నించారు.
పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ప్రభు త్వం జారీచేసిన జీవో-97ను రద్దుచేయాలని విద్యార్థులు పట్టుబట్టారు. శక్తి పాలసీతో 3లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
శక్తి పాలసీని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు హోరెత్తాయి. మాసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించి అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు. మెదక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు కండ్లకు గంతలు కట్టుకొని సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా రాజగోపాల్పేటలో సిద్దిపేట -హనుమకొండ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు.