నల్లగొండ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అనుకోవడం లేదని చెప్పారు. కేసీఆర్ రావాలి-మా ఎమ్మెల్యేలు పోవాలని ఓటర్లు అనుకున్నట్లు ఉందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పనితీరుకు ఓట్లు పడ్డాయని తెలిపారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన శాసన మండలి చైర్మన్ పదవీలో ఉన్నానని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. చట్టబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ఉందని తెలిపారు.
ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా సాధ్య అసాధ్యలను బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితి వివరించి పథకాలు అమలు చేయాలని, వాస్తవాలు చెబితే ప్రజలు తప్పకుండా అర్ధం చేసుకుంటారిన చెప్పారు. బీఆర్ఎస్ అధిష్టానం కూడా ప్రజలు తమకు వ్యతిరేకంగా తీర్పు ఎందుకిచ్చారని విశ్లేషన చేసుకుంటున్నదని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ద్యేయమని, అధికారం ఎవరికీ శాశ్వతంగా ఉండదని వెల్లడించారు.
మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను పేపర్లలలో చూశానని, విమర్శలకు, ప్రతి విమర్శలకు ఇప్పుడు సమయం కాదన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తూ, పక్కా కార్యాచరణతో వాళ్ళు పనిచేసుకుంటు వెళ్లాలని సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇద్దరు మంత్రులు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. జిల్లాలో ఇరిగేషన్ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటిపై దృష్టిపెట్టాలన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి మంత్రి వెంకట్ రెడ్డి పని చేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా బయటకు రావాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాని తెలిపారు.