CM KCR | దుబ్బాకతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పాఠశాల పెట్టిన భిక్షేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. దుబ్బాకలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరీయసి’. పుట్టిన గడ్డకంటే.. చదువుకున్న గడ్డకంటే గొప్పది ఏదీ ఉండదు అని చరిత్రలో చెప్పారు. దుబ్బాకలోనే నా హైస్కూల్ చదవంతా చదువుకున్నాను. దుబ్బాకతోని నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్న అంటే.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన అంటే.. దుబ్బాక పాఠశాల పెట్టిన ఆ చదువు భిక్షనే కారణం అని మనవి చేస్తున్నా’నన్నిరు.
‘మన దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నప్పటికీ అందులో రావాల్సినంతగా రాలేదు. వచ్చిన దేశాలు బాగా ముందుకు దూసుకొని వెళ్తున్నాయి. నేను చెప్పే నాలుగు విషయాలను విని మీ గ్రామాల్లో చర్చ పెట్టాలని కోరుతున్నా. ఎన్నికల్లో అభ్యర్థుల మంచీచెడుతో పాటు వారి వెనుక ఉన్న పార్టీల చరిత్ర, నడవడికను చూడాలి. ఎన్నికలు వచ్చాయంటే అన్ని అబద్ధాలు, అభండాలు.. తిమ్మిని బమ్మి చేయడం.. పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం.. పచ్చి దుర్మార్గాలు జరుగుతుంటయ్. ఆ పరిస్థితి నుంచి దేశం బయటపడాలి. అప్పుడు చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. మంచి జరుగుతుంది’ అన్నారు.
‘ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం ఓటు. మన ఐదు సంవత్సరాల రాష్ట్ర చరిత్ర, మన తలరాతను మారుస్తుంది. వేయాల్సిన వారికి కాకుండా వేరే వ్యక్తులకు ఆగమై ఓట్లు వేస్తే.. చెడ్డ ప్రభుత్వం వస్తే మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నేను చెప్పే నాలుగు మాటలు విని నిజానిజాలు తేల్చాలి. బీఆర్ఎస్ పోరాటం చేసి తెలంగాణ సాధించింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ స్టేట్ పేరుతో బాగుండేది. దాన్ని ఊడగొట్టి ఆంధ్రాలో కలుపడంతో 58 సంవత్సరాలు గోసపడ్డాం. 2014 సంవత్సరంలో తెలంగాణ వచ్చిన నాడు మన పరిస్థితి ఏంటీ ? మంచినీళ్లు లేవు.. సాగునీరు లేదు.. చేనేత కార్మికుల ఆకలిచావులు.. రైతుల ఆత్మహత్యలు, వలసలు ఇలా ఎన్నో బాధలు. అంత కాంగ్రెస్ మనల్ని బాధపెట్టింది. మన రాష్ట్రం మనకే ఉంటే బ్రహ్మాండంగా ఇవాళ ఎక్కడో ఉందుము’ అన్నారు.
‘కాంగ్రెస్కు తమాషా.. మనకు జీవన్మరణ సమస్య. రైతుల భూముల బాధలు నాకు తెలుసు. మూడు సంవత్సరాలు తండ్లాడి ధరణిని తీసుకువచ్చాం. ఇంతకు ముందు రైతు భూమిపై హక్కులు రైతుల దగ్గర ఉండేవి కావు. ఏ రాత్రి ఎవడు కిందమీద రాసినా భూమి మారిపోయేది. ఎల్లయ్య భూమి మల్లయ్యకు.. మల్లయ్యది పుల్లయ్యకు రాస్తురు. ఆ బాధ పోవాలని ప్రభుత్వంలో ఉండే అధికారాన్ని తీసివేసి మీ బొటనవేలికి ఇచ్చాం. మీ బయోమెట్రిక్ లేకుండా భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నడు. రాహుల్కు ఎద్దు, ఎవుసం తెలుసో తెల్వదో నాకు తెల్వుదు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తమని అంటున్నడు. దాని స్థానంలో భూమాత పెడుతరట. అది భూమాతనా? భూమేతనా? అంటూ ప్రశ్నించారు.
‘ఇవాళ భూములు రిజిస్ట్రేషన్లు ఈజీగా అవుతున్నయ్. లంచాల బాధ తప్పింది. మేం రైతుబంధు పంపిస్తే ఎంత మంచిగ వస్తున్నయ్. మీరు తీసుకొని పెట్టుబడికి వాడుకుంటున్నరు. ధరణిని తీసివేస్తే రైతుబంధు డబ్బులు ఎట్ల వస్తయ్. మళ్లీ పాత కథనే కదా? ఇవాళ ఇంట్ల కుసుంటనే డబ్బులు వస్తున్నయ్. రేపు అట్ల రావు. పటేల్ పట్వారీలను తెచ్చి.. కౌలుదార్ కాలమ్ పెట్టి చేస్తే ఏమవుతుంది.. మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగాలి. దరఖాస్తులు పట్టుకొని వెళ్తే రూ.30వేలు ఇవ్వమంటడు. మళ్లీ మొదటికే వస్తుది. పదేళ్ల నుంచి నేను పడ్డ పాట్లు.. కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. నేను చెప్పిన ప్రజాస్వామ్య పరిణితిపై ఆలోచన చేయాలి. ఈ విషయాలపై కేసీఆర్ కార్యకర్తలు చర్చ పెట్టాలి. వాటిపై మంచో చెడో తేలుద్దాం’ అన్నారు.