తెలంగాణలో టెస్ట్ ట్రాక్లు, మౌలిక వసతుల ఏర్పాటు
మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా చేరేందుకు సంసిద్ధత
సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరో ప్రఖ్యాత బహుళజాతి సంస్థ రానున్నది. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ తెలంగాణలో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల సందర్భంగా హ్యుందాయ్ సీఐవో యంగ్చో చి గురువారం తెలంగాణ పెవిలియన్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించారు. ఈ పెట్టుబడితో టెస్ట్ ట్రాక్లతోపాటు ఎకో సిస్టమ్కు అవసరమైన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు అంగీకరించారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన హ్యుండాయ్ కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ పెట్టుబడి రాష్ట్ర మొబిలిటీ రంగానికి బలాన్ని ఇస్తుందని చెప్పారు. హుండాయ్ రాకతో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకొన్న హ్యుండాయ్కి ధన్యవాదాలు తెలిపారు.
ఈఎంపీఈకి పూర్తి సహకారం: కేటీఆర్
క్షయ వ్యాధిపై జరుగుతున్న పోరాటంలో ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్ ముందు వరుసలో ఉండటం సంతోషకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీబీపై హైదరాబాద్ కేంద్రంగా పోరాడబోతున్న ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ పాల్గొన్నారు.
207 కోట్లతో టీబీ కిట్ల తయారీ కేంద్రం
ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్ సీఈవో పవన్
క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణ కిట్లను తయారు చేసేందుకు హైదరాబాద్లో గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్టు స్వీడన్ సంస్థ ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్ ప్రకటించింది. దశలవారీగా రూ.207 కోట్ల (25 మిలియన్ యూరోల) పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. తొలుత రూ.25 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో ప్రారంభించనున్న కేంద్రంలో నెలకు 20 కిట్లను తయారు చేయనున్నట్టు కంపెనీ వ్యవస్థాపక సీఈవో డాక్టర్ పవన్ అసలాపురం గురువారం దావోస్లో మంత్రి కేటీఆర్కు వివరించారు. దీనికి అదనంగా మరో రూ.50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్టు చెప్పారు. ఐదు దేశాల్లో క్లినికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత తమ యూనిట్ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకొన్నట్టు తెలిపారు. హైదరాబాద్లో తయారయ్యే కిట్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తామన్నారు. యూనిట్ ఏర్పాటుకు సహకరిస్తున్న మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.