హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఒవైసీ దవాఖాన-మిధాని జంక్షన్లో నిర్మించిన ఫ్లైఓవర్కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టినట్టు రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. డీఆర్డీవోలో దశాబ్దకాలం పాటు పనిచేసిన అబ్దుల్ కలాంకు ఇదే తమ నివాళి అని పేర్కొన్నారు. అప్పట్లో అబ్దుల్కలాం ఈ ప్రాంతంలోనే నివాసం ఉన్నారని గుర్తుచేసుకొన్నారు. కంచన్బాగ్లోని డీఆర్డీవో వైపు నుంచి ఒవైసీ దవాఖాన జంక్షన్ మీదుగా బైరామల్గూడ మార్గంలో నిర్మించిన 1.3 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ను మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో తొలిసారిగా నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయం, భూసేకరణ ఖర్చులు కలిపి రూ.80 కోట్లు వెచ్చించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్సార్డీపీ)లో భాగంగా జీహెచ్ఎంసీ దీనిని చేపట్టిందని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా ఈ ఫ్లైఓవర్ నిలువనున్నది. దీనితో పాతబస్తీ నుంచి ఎల్బీనగర్ వైపు ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి. మెహిదీపట్నం, చాంద్రాయణగుట్ట, మిధాని నుంచి వచ్చే వాహనదారులు ఫ్లైఓవర్ ద్వారా మందమల్లమ్మ, సంతోష్నగర్, సాగర్ రింగ్రోడ్డు, ఎల్బీనగర్ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు. చాంద్రాయణగుట్ట, కర్మన్ఘాట్ మార్గాల ద్వారా వెళ్లే వాహనదారులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ ఫ్లైఓవర్ను ప్రికాస్ట్ టెక్నాలజీతో నిర్మించారు. కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు సయ్యద్ అమినుల్ హాసన్జాఫ్రీ, మీర్జా రియాజ్, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్లైఓవర్ విశేషాలు
పొడవు – 1.3 కిలోమీటర్లు
నిర్మాణ వ్యయం – రూ.80 కోట్లు