నల్లగొండ : వివాహ శుభ కార్యక్రమానికి వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు నల్లగొండ జిల్లాలో ఈతకు వెళ్లి కాల్వలో గల్లంతయ్యారు. హైదరాబాద్కు చెందిన ఎస్.కె లతీఫ్ అతడి స్నేహితుడు నల్లగొండ జిల్లా నిడమానూర్ మండలం నారమ్మగూడెంలో శనివారం సాయంత్రం జరిగే వలిమా డిన్నర్లో పాల్గొనేందుకు గ్రామానికి చేరుకున్నారు. సమీపంలోని ముదిమణిక్యం మేజర్ కాల్వలో ఈత కోసం స్నేహితులతో కలిసి దిగారు.
కాలువ లోతు తెలియక దిగడంతో నీటి ప్రవాహానికి ఇద్దరూ కొట్టుకుపోయారు. కొట్టుకుపోతున్న వీరిని స్థానికులు గమనించి కాల్వలో దూకి వారిని ఒడ్డుకు చేర్చారు. అయితే వీరిలో ఎస్.కె లతీఫ్ అప్పటికే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.