ఎర్రవల్లి చౌరస్తా, జనవరి 13 : జోగులాంబ గద్వాల జిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తాపడి మంటలు రావడంతో మహిళ సజీవదహనమైంది. అమెజాన్ జగన్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు శుక్రవారం రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్లోని మియాపూర్ నుంచి ఏపీలోని చిత్తూరుకు వెళ్తుంది. ఇందులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. మధ్యర్రాతి 2.30 గంటల ప్రాంతంలో జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం టెన్త్ బెటాలియన్ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో అదే క్రమంలో లారీని ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది.
అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులోంచి బయటకు వచ్చారు. మెహిదీపట్నంకు చెందిన మాలతి (40) బస్సులోని సీటు కింద ఇరుక్కుపోయింది. కేకలు విన్న తోటి ప్రయాణికులు శతవిధాలా ప్రయత్నించారు. వెంటనే షార్ట్ సర్క్యూట్తో బస్సులో పొగలు రావడంతో భయంతో వారు బయటకు వెళ్లిపోగా.. అకస్మాత్తుగా మంటలు అంటుకుకొని బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ మంటల్లోనే ఆమె సజీవ దహనమైంది. కాగా ఇమ్రాన్ అనే యువకుడు ప్రాణాలను పణంగా పెట్టి ఐదుగురు ప్రయాణికులను కాపాడారు.