హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం బయాలజీ, టెక్నాలజీకి అరుదైన వేదికగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘హైదరాబాద్ అనేది బయాలజీ, టెక్నాలజీ కలిసి ఉండే అరుదైన ప్రదేశం. అందుకే ప్రపంచ బయోటెక్నాలజీ, ఫార్మా హబ్గా వెలుగొందుతున్నది’ అని పేర్కొన్నారు. జీనోమ్వ్యాలీ, ఫార్మాసిటీ రూపంలో ఓవైపు బయోమెడికల్ రంగంలో పరిశోధనలు, ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమల స్థాపన, ఔషధాల ఉత్పత్తి సాగుతున్నదని.. మరోవైపు హైదరాబాద్ నగరంలోని ఐటీ కంపెనీలు డిజిటల్ సొల్యూషన్స్ అందిస్తున్నాయని తెలిపారు. తెలంగాణకు ఉన్న ఈ సానుకూలతలను ప్రపంచం మొత్తం గుర్తిస్తున్నందుకే ప్రపంచ బయో హబ్గా రాష్ట్రం ఎదుగుతున్నదని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి నగరంలో బయో ఏషియా సదస్సు జరుగనున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మంగళవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ప్రపంచంలో సగం టీకాలు హైదరాబాద్లోనే ఉత్పత్తి
రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం విలువ ను 2028 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఈ రంగంలో 4 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారని.. ఈ సంఖ్యను 8 లక్షలకు పెంచుతామని చెప్పారు. రాష్ట్రంలో ఏటా 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని, ఇది ప్రపంచ ఉత్పత్తిలో 35 శాతమని వెల్లడించారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి వచ్చే ఏడాది నాటికి 1,400 కోట్లకు పెరుగుతుందని, ఇది మొత్తం ఉత్పత్తిలో 50 శాతమని తెలిపారు. దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో తెలంగాణ వాటా 40 శాతం గా ఉన్నదన్నారు. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అనుమతులు పొందిన ఫార్మా యూనిట్లు రాష్ట్రంలో 214 ఉన్నాయని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని చెప్పారు. 180 యూనిట్లతో న్యూజెర్సీ రెండో స్థానంలో నిలిచినట్టు తెలిపారు. ప్రస్తు తం రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ రంగ ఎగుమతుల విలువ 13 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు.
ఈ ఎకో సిస్టం మన అదృష్టం
హైదరాబాద్ను ‘బయాలజీ మీట్స్ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ మీట్స్ డాటా సైన్స్’ అని చెప్తుంటానని, ఇందుకు నోవార్టిస్ ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘నోవార్టిస్లో ప్రస్తుతం సుమారు 9 వేల మంది వరకు పనిచేస్తున్నారు. ఇందులో 400 మంది మాత్రమే ల్యాబ్లో పనిచేస్తారు. మిగతావాళ్లు డిజిటల్ ప్లాట్ఫాంపై పనిచేస్తున్నారు. ఇలాంటి బయాలజీ, టెక్నాలజీ కలగలిసిన వాతావరణం ఉండటం మన అదృష్టం. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఐసీటీ, సీసీఎంబీ వంటి ప్రభుత్వ సంస్థలు.. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ వంటి ప్రైవేటు సంస్థల్లో భారీగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందుకే కొవిడ్ సమయంలో అతి తక్కువ సమయంలోనే వ్యాక్సిన్లు అభివృద్ధి చేసి, ప్రపంచానికి అందించగలిగాం’ అని వివరించారు. మన వద్ద ప్రపంచస్థాయి ప్రయోగ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి, ఇన్ని అనుకూలతలున్నందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలంగాణవైపు చూస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి సమస్యకైనా హైదరాబాద్ పరిష్కారం చూపుతుందనే నమ్మకం పెరుగుతున్నదని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్, జీనోమ్ వ్యాలీ ప్రస్తుతం పరిశ్రమలతో నిండిపోయాయని చెప్పారు. వీటి విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఇన్నాళ్లూ ప్రభుత్వం వసతులు కల్పించిన తర్వాత పరిశ్రమలు వచ్చేవని, ఇప్పుడు కంపెనీలే ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొని అక్కడ వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టి వారి కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడుల్లో 24 శాతం విస్తరణల రూపంలోనే వచ్చాయని వివరించారు.
దేశానికే తలమానికంగా ఫార్మాసిటీ
రాష్ట్ర ప్రభుత్వం 14 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని త్వరలో ప్రారంభించే అవకాశాలున్నాయని కేటీఆర్ తెలిపారు. ఫార్మాసిటీపై వేసిన కేసుల విచారణ పూర్తయిందని, తీర్పు రిజర్వ్లో ఉన్నదని చెప్పారు. ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ అవుతుందని, ఇది తెలంగాణతోపాటు దేశానికే తలమానికంగా నిలుస్తుందని అన్నారు. ఫార్మా ఉత్పత్తులు, పరిశోధన కేంద్రాలతో భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండబోతున్నదని చెప్పారు. ఇప్పటివరకు అక్కడ ఎవరికీ స్థలాలు కేటాయించలేదని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ, దవాఖాన, నర్సింగ్ కాలేజీని ఫార్మాసిటీలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. ఫార్మాసిటీకి అనుగుణంగా నిపుణులను తీర్చిదిద్దేందుకు ఇప్పటికే లండన్లోని కింగ్స్ కాలేజీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.
ఆరోగ్యం, టెక్నాలజీ కలిస్తే అద్భుతాలు
రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం ప్రజారోగ్య, బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోగ్యం, టెక్నాలజీ కలిస్తే అద్భుతాలు చేయవచ్చని అన్నారు. ఇందుకు హెల్త్ ప్రొఫైల్ను ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. హెల్త్ ప్రొఫైల్తో అనేక ప్రాణాలు కాపాడొచ్చని చెప్పారు. ఇప్పటికే ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ప్రాథమిక, పాథాలజీ పరీక్షల ద్వారా ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించామని వెల్లడించారు. త్వరలో దీనిని 33 జిల్లాలకు విస్తరించి పూర్తి ఆరోగ్య సమాచారంతో కూడిన స్మార్ట్ కార్డ్ను ప్రజలకు అందించే ఆలోచన ఉన్నదని చెప్పారు.
ప్రజలు డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు, డయాగ్నోస్టిక్స్లో పరీక్షలు చేయించుకొన్నప్పుడు ఈ వివరాలను అప్డేట్ చేసేలా వ్యవస్థ రూపొందిస్తామని వివరించారు. ఈ డాటాకు అనుగుణంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలా పథకాలు, వసతులను కల్పించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ వ్యవస్థతో అత్యవసరమైనప్పుడు రోగుల ప్రాణాలు కాపాడొచ్చని తెలిపారు. ‘ఎవరైనా ప్రమాదం కారణంగా అపస్మారక స్థితికి వెళ్లిపోతే దవాఖానకు వెళ్లిన తర్వాత బ్లడ్ గ్రూప్, బీపీ, షుగర్ వంటి ప్రాథమిక వివరాలు తెలుసుకోవడానికి 10-15 నిమిషాల విలువైన సమయం వృథా అవుతుంది. కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారికి కొన్ని ఔషధాలు ఇవ్వకూడదు. ఆ వివరాలు తెలియక చికిత్స కొనసాగిస్తుంటారు. అలా కాకుండా ఒక వేలిముద్రతో లేదా ఐరిస్తో హెల్త్ ప్రొఫైల్ను యాక్సెస్ చేయగానే రోగి సమగ్ర సమాచారం డాక్టర్లకు తెలిసిపోతే సత్వరమే సరైన చికిత్స అందించి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంటుంది’ అని వివరించారు.
ప్రపంచంలో ఎక్కడికైనా కన్సల్టేషన్
కొందరు తీవ్రమైన వ్యాధుల బారిన పడినవారు కన్సల్టేషన్ కోసం విదేశాలకు వెళ్తుంటారని, హెల్త్ ప్రొఫైల్ పూర్తయితే ఆ డిజిటల్ రిపోర్టులను నేరుగా ప్రపంచంలో ఏ మూలన ఉన్న డాక్టర్కైనా పంపవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆన్లైన్లో కన్సల్టేషన్ ద్వారా సలహాలు సూచనలు పొందవచ్చని, దీంతో సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు.
డాటా.. ప్రభుత్వం చేతిలోనే
హెల్త్ ప్రొఫైల్, కంటివెలుగు కార్యక్రమాల ద్వారా ప్రజలకు సంబంధించిన భారీ సమాచారం ప్రభుత్వం వద్దకు చేరుతున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ డాటాతో ఏయే కార్యక్రమాలు చేపట్టాలో ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. వాస్తవానికి ఈ డాటా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తే వారికి బంగారు గనిలాగా మారుతుందని, కానీ తమది బాధ్యత గల ప్రభుత్వమని.. ప్రజలు నమ్మి తమ ఆరోగ్య సమాచారాన్ని ఇస్తున్నారని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు ఇవ్వబోమని మంత్రి స్పష్టం చేశారు. ఏ సమాచారం పంచుకోవాలో, ఏ సమాచారం పంచుకోవద్దో తమకు స్పష్టత ఉన్నదని పేర్కొన్నారు.
జిల్లాకో స్పెషల్ యూనిట్
సిరిసిల్ల జిల్లాలో ఎక్కువగా బీడీ కార్మికులుంటారని, హెల్త్ ప్రొఫైల్ పరీక్షల్లో క్యాన్సర్ రోగులు ఎక్కువగా ఉన్నట్టు ప్రాథమికంగా తేలిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీలో ప్రత్యేకంగా ఆంకాలజీ విభాగం ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నదని చెప్పారు. ఇలా జిల్లాల్లో అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రజల జీవన విధానానికి అనుగుణంగా కొన్ని రకాల వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నదని, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీల్లో సంబంధిత స్పెషాలిటీ సేవలను మరింత పటిష్ఠం చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రేపు అందరూ ఆశ్చర్యపోయే పెట్టుబడుల ప్రకటన
గురువారం అందరినీ ఆశ్చర్య పరిచేలా భారీ పెట్టుబడుల ప్రకటన ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ త్వరలో ఎం-ఆర్ఎన్ఏ టీకా పరిశోధనా కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నదని ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు నేతృత్వంలో ‘సెంటర్ ఫర్ ఫోర్త్ జనరేషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్’ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్టు చెప్పారు. బయో ఏషియా సదస్సు కొనసాగుతున్న సమయంలోనూ, ఆ తర్వాత పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని పేర్కొన్నారు. పరిశోధనల కోసం ప్రత్యేకంగా 30 లక్షల చదరపు అడుగుల ప్రాంతాన్ని కేటాయించగా అది నిండిపోయిందని, మరో 20 లక్షల చదరపు అడుగుల ప్రాంతాన్ని అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. జీనోమ్ వ్యాలీలో బీ-హబ్ నిర్మాణం ప్రారంభమైందని, అది పూర్తయితే బయో ఫార్మా రంగంలో స్టార్టప్లకు హబ్గా మారుతుందని అన్నారు.