హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 100 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. బస్తీల్లో సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన ‘బస్తీ దవాఖానలు’ విజయవంతంగా నడుస్తున్నాయి. మొదట జీహెచ్ఎంసీకే పరిమితమైన వీటిని ప్రభుత్వం ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు విస్తరిస్తున్నది.
2018లో 35 బస్తీ దవాఖానలు ప్రారంభం కాగా.. తాజాగా పెరిగిన వందతో కలుపుకొని ప్రస్తుతం ఆ సంఖ్య 432కు చేరనున్నది. ఇప్పటివరకు సుమారు 2 కోట్ల మంది బస్తీ దవాఖానల్లో సేవలు పొందారు. నిరుడు ఓపీ సంఖ్య ఏకంగా 47.73 లక్షలుగా నమోదైంది. సగటున ఒక్కో దవాఖానలో రోజుకు 40-50 మంది వైద్య సేవలు పొందుతున్నారు. అవసరం ఉన్నవారికి అక్కడికక్కడే నమూనాలు సేకరించి టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 134 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
బస్తీ దవాఖానల సంఖ్య ఏటా పెరిగిందిలా..
సంవత్సరం : పెరిగినవి
2018లో : 35
2019 : 53
2020 : 116
2021 : 32
2022 : 96
2023 : 100
మొత్తం : 432