హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న మొదటి నగరంగా హైదరాబాద్ అతి త్వరలో అవతరించనున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారక రామారావు ప్రకటించారు. మురుగు నీటి శుద్ధి కోసం రూ.3,866 కోట్ల వ్యయంతో 31 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. వీటి ద్వారా రోజుకు 1,258 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) మురుగునీటిని శుద్ధి చేయవచ్చని వెల్లడించారు.
హైదరాబాద్ ఇప్పటికే దేశంలోని లివబుల్ సిటీస్ జాబితాలో ముందున్నదని.. అంతర్జాతీయ అగ్ర నగరాల సరసన నిలపడమే లక్ష్యమని స్పష్టంచేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం హోటల్ తాజ్ డెక్కన్లో నిర్వహించిన సదస్సులో ‘రీప్లానెట్ ఇనీషియేటివ్’ అనే అంశంపై మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. ఈ ఎస్టీపీల ద్వారా వెలువడే శుభ్రమైన నీటిని నిర్మాణ రంగం, ల్యాండ్ స్కేపింగ్, హార్టికల్చర్, థర్మల్ ప్లాంట్ల ఫర్నేస్ల కూలింగ్ తదితర వాటికోసం ఉపయోగించనున్నట్టు పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి సాధించే లక్ష్యంతో ప్రభుత్వం మురుగునీటి శుద్ధి, సమర్థ నీటి వినియోగం, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. పట్టణ ప్రాంతాలు పెట్టుబడి కేంద్రాలుగా మారాయని, దీంతో గ్రామీణ ప్రాంతాలనుంచి పట్టణాలకు వలసలు ఎక్కువయ్యాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అధిక జనసాంద్రత కారణంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను క్రమపద్ధతిలో బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, ఈ దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
ప్రపంచ అగ్ర నగరాల సరసన హైదరాబాద్
గత కొన్నేండ్లుగా లివబుల్ సిటీ ఇండెక్స్లో దేశంలోనే ప్రథమ స్థానంలో హైదరాబాద్ నిలుస్తున్నదని, ఇంతటితో సరిపెట్టకుండా ప్రపంచంలోని 25 అగ్ర నగరాల సరసన నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రస్తుతం ప్రపంచంలో 140వ స్థానంలో హైదరాబాద్ ఉన్నదని చెప్పారు. పట్టణప్రాంతం అధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని, ఇక్కడ 46.8 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు. జాతీయ పట్టణ సగటు జనాభా 31 శాతం కాగా, దానికన్నా 15 శాతానికిపైగా అధికంగా తెలంగాణలో పట్టణ జనాభా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ వైశాల్యం 1.12 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా, హైదరాబాద్ 670 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నదని చెప్పారు. ఇతర పట్టణాలు మరో 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్తోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలు జీఎస్డీపీలో 45 శాతానికిపైగా వాటాను కలిగివున్నాయని వివరించారు. అదే సమయంలో గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల పుణ్యమా అని అకాల వర్షాలు, కుంభవృష్టి, క్లౌడ్బరస్ట్, ఆలస్యంగా రుతుపవనాలు, అధిక ఉష్ణోగ్రతలు తదితర సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నీటి వనరులను కాపాడేందుకు ప్రభుత్వం హైదరాబాద్లో హైడ్రలాజికల్ మ్యాపింగ్ను చేపట్టిందని తెలిపారు. నగరంలో ముంపు సమస్య తలెత్తకుండా ఉండేందుకు రూ.1000 కోట్లతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను చేపట్టి నాలాల బాటిల్నెక్స్ను విస్తరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని పనులు చేపట్టినట్టు తెలిపారు.
చెత్త నుంచి 20 మెగావాట్ల కరెంట్
హైదరాబాద్లో 2015లో రోజుకు 3,500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడగా.. ఇప్పుడు అవి 6,000 మెట్రిక్ టన్నులకు పెరిగాయని మంత్రి కేటీఆర్ తెలిపా రు. వ్యర్థాలను పూర్తిస్థాయిలో పునర్వినియోగం చేసుకోవడంలో భాగంగా జవహర్నగర్లో ఇప్పటికే 20 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేశామని, మ రో 28 మెగావాట్ల ప్లాంటు నిర్మాణంలో ఉన్నదని చెప్పారు. మరో 20 మెగావాట్ల ప్లాంటు నిర్మాణానికి ప్రణాళికలు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోని 68 మున్సిపాలిటీల్లోనూ ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. వచ్చే ఏడాది మొత్తం 142 మున్సిపాలిటీలకు వీటిని విస్తరిస్తామని చెప్పారు. ప్రజలు, ఎన్జీవోల భాగస్వామ్యంతో అనేక పురాతన మెట్లబావులను పునరుద్ధరించామని, రాష్ట్రంలో నేడు వారసత్వ నిర్మాణాల పునరుద్ధరణ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్నదని వివరించారు. హైదరాబాద్లో 218 వారసత్వ కట్టడాలను గుర్తించామని, వాటన్నింటినీ పునరుద్ధరించేందుకు చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు.