Summer | హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ)/మాడ్గులపల్లి: నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో మాడు పగిలేంతగా ఎండప్రభావం కనిపించింది. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 45.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధజిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటి, తీవ్రస్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి.
సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికంగా పెరిగాయి. రాష్ట్రంలో వచ్చే మూడురోజులు మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదారాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి, ములు గు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాలకు మూడు రోజులపాటు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. రాష్ట్రంలో 2015, 2016 తర్వాత అదే స్థాయిలో ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రతలు పునరావృతం అవుతున్నాయ ని వాతావరణ కేంద్రం తెలిపింది. వడదెబ్బ సోకి గురువారం కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహట్టి పరిధిలోని జనగామకు చెందిన వేలాది మధూకర్ (24), మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇగ్బాల్ అహ్మద్నగర్కు చెందిన షేక్ ఫరీద్ పాషా మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎండలు మండుతున్నాయి. 46 మండలాల్లో తీవ్ర వడగాలు, 175 మండలాల్లో వడగాలులు వీచాయని పేరొన్నది.
హైదరాబాద్లో మారిన వాతావరణం
హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉప్పల్, మల్లాపూర్, నాచారం, చెంగిచెర్ల, కీసర, కొంపల్లి, చర్లపల్లి, కాప్రా, కుషాయిగూడ, జవహర్నగర్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.