Summer | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): మార్చి నెల రాక ముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం నాటికి ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీలకు చేరువైంది. రాబోయే నాలుగు రోజుల్లో తీవ్రమైన వేడి వాతావరణ పరిస్థితులు ఉంటాయని, ఆ తర్వాత 5 నుంచి 6 రోజులపాటు వాతావరణం చల్లబడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం, రాత్రి వేళల్లో చల్లటి వాతావరణం ఉంటుందని పేర్కొన్నది. ఇదే నెల 10, 11 తేదీల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 16 తర్వాత ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతూ ఉంటాయని వెల్లడించింది.
గ్రేటర్ హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉకిరిబికిరి అవుతున్నారు. ఇప్పుడే ఎండలు మండిపోతుండటంతో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజుల్లో గ్రేటర్ పరిధిలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గురువారం జూబ్లీహిల్స్లో 38.4 డిగ్రీలు, సరూర్నగర్, చందానగర్లో 38.3, బేగంపేటలో 37.6, ఉప్పల్లో 37.3, శేరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్, మే నెలలను తలచుకొని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.