హైదరాబాద్ సిటీబ్యూరో/ హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం నుంచి సాయం త్రం వరకు దాదాపు రెండున్నర గంటలపాటు వాన దంచి కొట్టింది. ఎల్బీనగర్లో అత్యధికంగా 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులపై వరదనీరు ప్రవహించింది. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ తీరందాటి తెలంగాణ మీదుగా కదులుతుండటంతో దాని ప్రభావం వల్ల భారీ వర్షం కురిసింది. వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన వరద నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను నగర మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట, జగిత్యాల, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 7 సెంటీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైంది.
ఆదివారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోకూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చని చెప్పారు. ఇతర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించారు. నైరుతి రుతుపవనాలు శనివారంతో రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా వరకు విరమించాయని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర పశ్చిమ – మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనదని చెప్పారు.