హైదరాబాద్ సిటీబ్యూరో/కవాడిగూడ, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో రూ.3.5 కోట్ల హవాలా సొమ్ము పట్టుబడింది. దీనిని హిమాయత్నగర్ నుంచి హయత్నగర్కు ఒక కారులో తరలిస్తుండగా నార్త్జోన్ పోలీసులు పట్టుకొన్నారు. దీనిని ఉప ఎన్నిక జరగనున్న మునుగోడుకు తరలించేందుకు బీజేపీ పథక రచన చేసినట్టు తెలుస్తున్నది. కర్మన్ఘాట్కు చెందిన గండి సాయికుమార్రెడ్డి ఈ డబ్బును హిమాయత్నగర్కు చెందిన వెంకటేశ్వర్రావు అనే వ్యాపారి వద్ద తీసుకొన్నాడు. ఇతనితోపాటు గుండె మహేశ్, సందీప్కుమార్, మహేందర్, అనూష్రెడ్డి, భరత్ కూడా డబ్బు తరలింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు రూ.3.5 కోట్లతో ఒక కారులో కూర్చోగా, మిగిలినవారు మరో కారులో ఎస్కార్ట్గా బయలుదేరారు.
హిమాయత్నగర్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వెళ్తున్న ఈ కారును మారియెట్ హోటల్ వద్ద నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేయడంతో డబ్బు పట్టుబడింది. దీనిని హయత్నగర్లోని అంబికా పెట్రోల్బంక్ యజమాని సైదాబాద్కు చెందిన బాలు మహేందర్కు ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టు నిందితులు చెప్పారు. లెక్కలు చెప్పకపోవడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. నిందితులను గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు.
ఆ డబ్బు మునుగోడుకే..!
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసు తనిఖీలు పెరిగాయి. దీంతో బీజేపీ నేతలు శివారు ప్రాంతాల్లో భారీ మొత్తంలో డబ్బులు దాచిపెట్టి, వాటిని కొద్ది మొత్తాలుగా విభజించి, మునుగోడుకు తరలిస్తున్నట్టు సమాచారం. ఇందుకు ఎక్కువగా యువకులను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తున్నది. డబ్బు తరిలించేందుకు కమీషన్లు కూడా అందిస్తున్నట్టు సమాచారం. ఇటీవల టాస్క్ఫోర్స్ పోలీసులు హవాల దందాపై నిఘా పెట్టడంతో 10 రోజుల వ్యవధిలోనే సుమారు రూ.8 కోట్ల అనధికారిక డబ్బు పట్టుబడింది.