మహేశ్ బ్యాంక్పై విదేశాల నుంచే దాడి
సర్వర్ హ్యాక్ కేసులో కీలక హ్యాండ్లర్ అరెస్ట్
ప్రధాన నిందితుడి కోసం ఇంటర్పోల్ సాయం
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 : భవిష్యత్తులో బ్యాంకులపై మరిన్ని సైబర్ దాడులు జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బ్యాంకులు సైబర్ సెక్యూరిటీని పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో కీలకమైన నైజీరియన్ను అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడిని పట్టుకొనేందుకు ఇంటర్పోల్ సహకారం తీసుకొంటున్నామని చెప్పారు. మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసు దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. జనవరి 24న మహేశ్ బ్యాంక్ సర్వర్పై దాడిచేసిన హ్యాకర్లు రూ.12.48 కోట్లు లూటీ చేశారు. ఈ కేసును ఛేదించేందుకు వందమందితో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు నలుగురు నైజీరియన్లతోపాటు 23 మందిని అరెస్టు చేశాయని సీపీ తెలిపారు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్, మహేశ్ బ్యాంక్, బహ్రెయిన్ బ్యాంక్తోపాటు మహారాష్ట్రలో రెండు, నైజీరియాలో ఒక బ్యాంకు సర్వర్లపై దాడిచేసిన ముఠా ఒకటే అయి ఉంటుందని అనుమానిస్తు న్నామన్నారు. గత జూలైలో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ సర్వర్పై దాడిచేసిన ముఠా రూ.1.96 కోట్లు కొట్టేసింది.
నవంబర్లోనే స్కెచ్
మహేశ్బ్యాంక్పై దాడిచేసేందుకు ఈ ముఠా గత నవంబర్లోనే స్కెచ్ వేసినట్టు సీపీ ఆనంద్ చెప్పారు. హ్యాకర్లు నవంబర్ 4, 10, 16వ తేదీల్లో బ్యాంక్లో పనిచేసే 200 మంది ఉద్యోగులకు వైరస్తో కూడిన ఫిషింగ్ మెయిల్స్ పంపించారు. ఉద్యోగుల్లో ఇద్దరు ఆ మెయిల్స్ను తెరవడంతో రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ర్యాట్) వారి కంప్యూటర్లలో స్టోర్ అయ్యింది. వారిద్దరు వాడే కంప్యూటర్ల ద్వారా డాటాబేస్ సర్వర్ను ఉపయోగించి పది మంది ఉద్యోగుల పాస్వర్డ్, యూజర్ ఐడీలను అపహరించారు. మరోవైపు ఢిల్లీలో ఉండే హ్యాండ్లర్లు హైదరాబాద్లోని తమ ఏడుగురు అనుచరుల ద్వారా మహేశ్ బ్యాంక్లో ఖాతాలు తెరిపించారు.
దేశవ్యాప్తంగా 513 ఖాతాలు తెరిచారు. జనవరి 24న మహేశ్బ్యాంక్ ప్రధాన సర్వర్ను హ్యాక్చేసి తమ అనుచరులకు చెందిన నాలుగు బ్యాంక్ ఖాతాల ద్వారా ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలోని 115 ఖాతాలకు, అక్కడి నుంచి 398 ఖాతాలకు రూ.12.48 కోట్లు బదిలీ చేశారు. ఈ విషయంపై బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో, పోలీసులు స్పందించి ఆయా ఖాతాల్లోని రూ.2.08 కోట్లను ఫ్రీజ్ చేశారు. సాంకేతిక కారణాలతో బదిలీ అయిన సొమ్ములో రూ.95 లక్షల వరకు మాత్రమే వెనక్కి వచ్చింది. దేశవ్యాప్తంగా ఖాతాలు తెరిచినవారికి 10 శాతం కమీషన్ ఇచ్చి డబ్బంతా హ్యాకర్లు 938 ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకొన్నారని ఆనంద్ వివరించారు. డ్రా చేసిన డబ్బును హవాలా, క్రిప్టోకరెన్సీ ద్వారా విదేశాలకు తరలించారని తెలిపారు. విదేశాల నుంచే నిందితులు హ్యాకింగ్కు పాల్పడ్డారని చెప్పారు. హ్యాకర్లలో ఒకడైన స్టీఫెన్ ఓర్జీ, మరో వ్యక్తి హైదరాబాద్లోని కేపీహెచ్బీ ప్రాంతానికి వచ్చి, అక్కడ సంపత్కుమార్తో కలిసి తమ ఖాతాల్లోని డబ్బును వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారని వెల్లడించారు. స్టీఫెన్ ఓర్జీతోపాటు 22 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
సాప్ట్వేర్ సమకూర్చిన వాళ్లతో పాటు
మహేశ్ బ్యాంక్ ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తున్నదని, ఆ సొమ్మును రక్షించాల్సిన బాధ్యత కూడా బ్యాంకుదేనని సీవీ ఆనంద్ అన్నారు. ఈ బ్యాంకుకు ముంబైకి చెందిన ఇన్ఫ్రాటెక్ సంస్థ రూ.10 లక్షలకు సాప్ట్వేర్ అందిస్తున్నదని, ఇదే సంస్థ సాఫ్ట్వేర్ వాడుతున్న పలు బ్యాంకులను హ్యాకర్లు దోచుకొన్నారని తెలిపారు. నైజీరియాలో కూడా బ్యాంకులకు ఈ సంస్థ సాప్ట్వేర్ అందిస్తున్నదని, అక్కడ కూడా హ్యాకింగ్ ఘటనలు జరిగాయని చెప్పారు. ఇన్ఫ్రాటెక్కు చెందినవాళ్లకు, హ్యాకర్లతో సంబంధమున్నదనే అనుమానాలున్నాయని, వాళ్లను కూడా నిందితులుగా చేర్చుతున్నామని వెల్లడించారు. బ్యాంకు యాజమాన్యాన్ని కూడా నిందితులుగా చేర్చుతున్నట్టు పేర్కొన్నారు.