హైదరాబాద్/ సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): పార్ట్టైం ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతూ వందల కోట్లు దండుకుని విదేశాలకు తరలించిన కేసులో ప్రధాన నిందితుడు ప్రకాశ్ ప్రజాపతి నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించినట్టు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. కలర్ ప్రిడక్షన్, లోన్యాప్, ఇన్వెస్ట్మెంట్ వంటి ఎన్నో సైబర్ మోసాలను తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఛేదించారు. తాజాగా పార్ట్టైం జాబ్ పేరుతో వేలాదిమందిని ముంచిన కేసులో ఉగ్ర మూలాలు కూడా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఏకంగా రూ.712 కోట్ల స్కాం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు చిక్కిన ప్రకాశ్ ప్రజాపతి ముఠా ద్వారా చైనీయులు ఈ తతంగాన్ని నడిపించారు. కేసు విచారణలో మొత్తం 33 బోగస్ కంపెనీల ఏర్పాటు చేసి, 65బ్యాంక్ ఖాతాలను తెరిచినట్టు పోలీసులు గుర్తించారు. వాటిలో హైదరాబాద్కు చెందిన ఒక్క మునావర్ నెట్వర్క్లోని ఖాతాల్లోనే ఆన్లైన్ మోసాల ద్వారా రూ.128కోట్లు జమ అయినట్టు గుర్తించారు. ఆన్లైన్ మోసాల ద్వారా వివిధ ఖాతాల్లో జమ అయిన సొమ్ము ఆ తర్వాత క్రిప్టో కరెన్సీగా మారి చైనా, దుబాయ్లోని ఇతర నిందితులతోపాటు ఉగ్రవాద సంస్థల ఖాతాల్లోకి చేరింది.
రూ.712 కోట్ల సైబర్ క్రైం కేసులో ఉగ్రమూలాలు ఉండడంతో కేసును పూర్తిస్థాయిలో విచారించి నిజాలు నిగ్గు తేల్చేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే వారికి సమాచారం అందించినట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టాలంటూ ఎన్ఐఏకు సోమవారం లేఖ రాయనున్నట్టు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) సహాయం తీసుకున్నామని, వారి నుంచి తుది నివేదిక తెప్పించుకోనున్నట్లు పేర్కొన్నారు.
అతిపెద్ద సైబర్ క్రైమ్ రాకెట్ను ఛేదించడం, అందులో ఉగ్రవాద మూలాలు ఉండటంతో నిందితులను జాతీయస్థాయిలో విచారించే అవకాశం లేనందున ఎన్ఐఏ సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రకాశ్ ప్రజాపతి సోదరులకు అందిన డబ్బు క్రిప్టో రూపంలో చైనీయులకు, ఇతర క్రిప్టో వ్యాలెట్ల నుంచి లెబనాన్కు చెందిన హిజ్బుల్లా అనే ఉగ్రవాద సంస్థ ఎలా వెళ్లిందనే దానిపైనే పూర్తిస్థాయి దర్యాప్తు ఉంటుందని వివరించారు.