Neera cafe | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): నీరా కేఫ్ గీతవృత్తిదారుల ఆత్మగౌరవ పతాక అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. గౌడన్నల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి దీనిని నిర్మించిందని తెలిపారు. గౌడ ఉత్పత్తుల కేంద్రంగా నీరా కేఫ్ నిలుస్తుందని చెప్పారు. యావత్ గౌడ సమాజం కేసీఆర్కు రుణపడి ఉన్నదని తెలిపారు. హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డులో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నీరా కేఫ్ను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రకృతి నుంచి స్వచ్ఛంగా లభించే నీరాను అపహాస్యం చేసినా ప్రభుత్వం వెనకడుగు వేయలేదని అన్నారు.
నీరా స్వచ్ఛమైనది, ఆల్కహాల్ లేనిది కాబట్టే నాడు విమర్శించిన వారి చెంప చెళ్లుమనిపించేలా నీరా కేఫ్ను సీఎం కేసీఆర్ సుందరంగా తీర్చిదిద్దని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గీత కార్మికులకు బీమా వర్తింపచేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ కొనియాడారు. గౌడన్నలకు మద్యం షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపారని తెలిపారు. సర్దార్ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్బండ్పై పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. గౌడన్నలందరి పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
ప్రమాదాల నివారణకు తాటి చెట్టు ఎకే అధునాతన యంత్రాల రూపకల్పన కోసం ఐఐటీ లాంటి సాంకేతికత సంస్థల సహకారంతో పరిశోధనలు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. ఇప్పటికే రూపొందించిన రక్షిత మోకులను 1,45,481 మంది గీత కార్మికులకు అందిస్తామని చెప్పారు. తాటిచెట్టు నుంచి పడి చనిపోయిన 777 మంది, మంది శాశ్వత అంగవైకల్యం చెందిన 1,966 మందికి రూ.5 లక్షలు, తాతాలిక వైకల్యం చెందిన 2,725 మందికి మొత్తం 5,468 కుటుంబాలకు రూ.63.55 కోట్ల ఎక్స్గ్రేషియో అందించామని మంత్రి చెప్పారు. సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోటలను పురావస్తు కేంద్రాలుగా, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
నీరా కేఫ్ ప్రారంభం అనంతరం నీరాతో తయారుచేసిన తాటిబెల్లం, ఈత తేనె, తాటి తేనె, చక్కెర, బూస్ట్ వంటి ఉప ఉత్పత్తులను మంత్రి శ్రీనివాస్యాదవ్ ఆవిష్కరించారు. అతి కొద్దిరోజుల్లోనే నీరా ఐస్క్రీమ్, తాటి ముంజల ఐస్క్రీమ్ ప్రవేశపెడుతున్నట్టు మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలతో అభిషేకం చేశారు. అహర్నిశలు విశేషకృషి చేసిన ఎక్సైజ్, టూరిజం అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు డాక్టర్ ఆంజనేయగౌడ్, గెల్లు శ్రీనివాస్యాదవ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ మంత్రి రాజేశంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాజలింగంగౌడ్, మాజీ చైర్మన్ నాగేందర్గౌడ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళకు చెందిన స్వామీజీలు నాగలింగస్వామి, బసవమూర్తిస్వామి, కుంబాలస్వామి, శివానందస్వామి, ప్రణవానందస్వామి, నిచ్చల్ నిరంజన్ దేశందు స్వాములు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్గౌడ్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తిగౌడ్, ఆర్టీఏ అధికారులు చక్రవర్తిగౌడ్, తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులు, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావుగౌడ్, మోకుదెబ్బ గౌడ సంఘం అధ్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక గౌడ సమాజానికి చెందిన వ్యక్తిగా.. ఇక్కడి నీరా కేఫ్ను, ప్రకృతి పానీయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వచ్చాను. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన నీరాను రుచిచూశాను. చాలా అద్భుతంగా ఉన్నది. మేము కూడా ఇలాంటి వ్యవస్థను బెంగళూరులో అమలు చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం, మంత్రి శ్రీనివాస్గౌడ్ నాయకత్వంలో గౌడన్నలు సౌఖ్యంగా ఉన్నారు. తెలంగాణ సీఎంకు, మంత్రికి ధన్యవాదాలు.
– ప్రణవానంద స్వామిజీ, బ్రహ్మశ్రీ నారాయణ గురుశక్తి పీఠం బెంగళూరు
తాటిచెట్టు ఎక్కేటప్పుడు ఒక్కోపాలి పట్టుదప్పి మా పానాలు ఎప్పుడు పోతయో తెల్వదు. కొందరు కాల్జేతులిరగ్గొట్టుకుంటరు. మా ఆందరికీ కేసీయార్ పెద్ద కొడుకు లెక్క బీమా ఇస్తనన్నడు. ఆ బిడ్డ సల్లగుండాలె. కేసీయారు వచ్చినంకనే గౌడ్లకు పింఛనొస్తున్నది. కల్లు అద్దెలు మాఫీ అయినయ్. ఈతలు, తాళ్లు పెంచుతుండు. నేనైతే మస్తు ఖుషీగున్నా.
– ఎల్లంకి జానయ్యగౌడ్, లోయపల్లి, ఇబ్రహీంపట్నం