హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 22(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రోకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవార్డుల పోటీల్లో ఫైనల్ జాబితాలో చోటు దక్కించుకున్నది. స్పెయిన్ బార్సిలోనాలో ఈ నెల 4 నుంచి 7 వరకు యూఐటీపీ గ్లోబల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదస్సు జరిగింది.
ఈ సదస్సులో ఎలివేటింగ్ మల్టిమాడల్ ట్రాన్సిట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్, ఇండియాపై అందించిన నామినేషన్ ఫైనలిస్టులలో హైదరాబాద్ ఎల్అండ్టీ మెట్రో రైల్ ఒకటిగా నిలిచింది. మల్టిమాడల్ ఇంటిగ్రేషన్ క్యాటగిరీ కింద వచ్చిన 500 నామినేషన్లలో షార్ట్ లిస్ట్ చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎల్అండ్టీ మెట్రో రైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ ఫైనల్ జాబితాలో ఒకటిగా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. పర్యావరణ అనుకూలమైన రవాణా సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా చేసిన కృషికి ఈ గౌరవం దక్కిందని చెప్పారు.