వ్యాపారాభివృద్ధికి ఉన్న అనుకూలతలు, అభివృద్ధి కారణంగా హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రపంచస్థాయి నగరాలతోనే హైదరాబాద్కు పోటీ. నగరంలో 2012-13లో రెండు మిలియన్ల చదరపు అడుగుల పైచిలుకు కమర్షియల్ లీజ్ స్పేస్ ఉండగా, అది గత ఏడాది 11 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నది. –కేటీఆర్
హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): దేశంలో పెట్టుబడులకు 28 గేట్వేలు (రాష్ర్టాలు) ఉన్నాయని, వాటిలో తెలంగాణే బెస్ట్ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ లీజుల్లో ఇప్పటికే బెంగళూరును దాటేసి హైదరాబాద్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల అనుకూల వాతావరణం సృష్టించడం, వ్యాపార అనుకూల విధానాలను నిరంతరం కొనసాగించడంవల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. పారిశ్రామికవేత్తలే తెలంగాణకు అసలైన అంబాసిడర్లని సోమవారం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులతో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతకుముందు హైటెక్సిటీలో ఇన్సూరెన్స్ టెక్నాలజీ సంస్థ ష్యూరిఫై ల్యాబ్స్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కొలియర్స్ నూతన కేంద్రాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే ప్రాంతానికి కంపెనీలు పరిమితం కాకుండా హైదరాబాద్ నలువైపులా అభివృద్ధి జరుగాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. నగరంలో వ్యాపారాభివృద్ధికి ఉన్న అనుకూలతలు, వేగవంతంగా సాగుతున్న అభివృద్ధి కారణంగా హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రపంచస్థాయి నగరాలతోనే హైదరాబాద్కు పోటీ అని కేటీఆర్ స్పష్టంచేశారు. నగరంలో 2012-13లో రెండు మిలియన్ల చదరపు అడుగుల పైచిలుకు కమర్షియల్ లీజ్ స్పేస్ ఉండగా, అది గత ఏడాది 11 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుందని, దీన్నిబట్టి హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఐటీలోనే కాకుండా లైఫ్సైన్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాల్లోనూ హైదరాబాద్ అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వపరంగా పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యుత్ కోతల్లేకుండా చేయగలిగామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
టైర్-2 నగరాలకు విస్తరించాలి
ఎక్కువమంది ఇన్వెస్టర్లు హైదరాబాద్కు పశ్చిమం వైపే దృష్టి పెడుతున్నారని, ఇతర ప్రాంతాల వైపు ఎదుగుదలకు ఉన్న అవకాశాలను వారు గుర్తించాలని కేటీఆర్ సూచించారు. ఇటీవలే హైదరాబాద్కు ఉత్తరాన ఐటీ గేట్వే పార్కును ప్రారంభించినట్లు తెలిపిన ఆయన.. తూర్పువైపున కూడా పెద్దఎత్తున కంపెనీలు రానున్నాయని పేర్కొన్నారు. కంపెనీలు ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా ఎక్కడినుంచైనా కార్యకలాపాలు సాగించవచ్చని కోవిడ్ వల్ల అర్థమైందని, ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం సంస్కృతి పెరిగిందని ఆయన అన్నారు. అలాగే, హైబ్రిడ్ పద్ధతి ఎక్కువగా అమల్లోకి వచ్చిందన్నారు. దీంతో ఒక్క హైదరాబాద్కే కంపెనీలు పరిమితం కాకుండా.. వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ లాంటి టైర్-2 నగరాలకు విస్తరించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కోవిడ్తో నగరాలు, గ్రామాల మధ్య అంతరాలు చెదిరిపోయాయని.. టైర్-2 నగరాలకు వెళ్లే కంపెనీలకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలను పూర్తిగా అందిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్: జగదీశ్రెడ్డి
అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ఖ్యాతి గడిస్తున్నదని, కేటీఆర్ నాయకత్వ పటిమతోనే ఇది సాధ్యమైందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని సృష్టించారని సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, మంత్రి కేటీఆర్ నిరంతర కృషితో అభివృద్ధి వేగవంతంగా సాగుతున్నదని అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీఆర్ మోహన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో స్టార్టప్ల వాతావరణం లేదని, కొత్త పెట్టుబడుల రాక అసలు ఉండేది కాదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి, పెట్టుబడులను రాబడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకే దక్కుతుందని ఆయన చెప్పారు. ష్యూరిఫై సీఈఓ డస్టిన్ మాట్లాడుతూ.. ఏడేండ్ల క్రితం అమీర్పేట్లో కేవలం ఒక వ్యక్తితో కార్యాలయాన్ని ప్రారంభించామని, ప్రస్తుతం 220మందికి పైగా పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం హైటెక్సిటీ రెండవ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమెరికా సహా తమ సంస్థ మూడు కార్యాలయాల్లో కలిపి మొత్తం 320మంది పనిచేస్తుంటే.. అందులో 220మంది హైదరాబాద్లోనే పనిచేస్తున్నారని డస్టిన్ వివరించారు. నగరంలో వ్యాపార అనుకూలత ఉందని, ముఖ్యంగా కంపెనీలకు మంత్రి కేటీఆర్ సహకారం ఎంతో ఉందని ఆయన కొనియాడారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హైటెక్సిటీలోని మైహోం ట్విట్జా 14వ అంతస్తు హైదరాబాద్ సూరిఫై ల్యాబ్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముచ్చటిస్తున్న మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, పారిశ్రామికవేత్త బీవీఆర్ మోహన్రెడ్డి