హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ):ఒక పని మొదలుపెట్టే ముందు సాదాసీదాగా అనిపించవచ్చు. ఇదంతా సాధ్యమా? అనే వ్యాఖ్యలూ వినిపించవచ్చు. కానీ ఆ పనికి సంబంధించిన ఫలితం కండ్లముందు కనిపించినప్పుడు విమర్శకులు కూడా నోరెళ్లబెట్టక తప్పదు. తెగిడిన నోళ్లే సంభ్రమాశ్చర్యాలతో పొగడక తప్పదు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి అద్భుతాన్నే ఆవిష్కరించింది. నిత్యం శత్రువులా చూసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా
ఔరా అని ఆశ్చర్యపోయే ఫలితాలను సాధించింది. ఇటీవల కేంద్రప్రభుత్వం విడుదలచేసిన సామాజిక ప్రగతి సూచీ-2022లో అనేక రంగాల్లో తెలంగాణ అగ్రపథాన నిలిచింది. ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పక్కా ఇండ్ల నిర్మాణం, ఉన్నత విద్య పథకాలు రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించాయి.
సమాజాన్ని సమూలంగా మార్చివేస్తున్న వాస్తవాన్ని ఈ నివేదిక కండ్లకు కట్టింది. వంటకోసం అత్యంత సురక్షిత ఇంధనం వాడుతున్న రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ టాప్లో నిలిచింది.
‘సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్: స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో విడుదలచేసిన నివేదికలోని అంశాలు తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతతో కూడిన పనితీరుకు, చిత్తశుద్ధికి అద్దం పట్టాయి. ఈ నివేదికను ఐఎఫ్సీ, ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్, జీ2వోతో కలిసి ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు కౌన్సిల్ రూపొందించింది. విద్య, వైద్యం, తాగునీరు, ఆవాసం, వ్యక్తిగత రక్షణ తదితర సామాజికాభివృద్ధి అంశాల్లో గత దశాబ్దకాలంలో సాధించిన ప్రగతిని దేశం, వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లాలవారీగా లెక్కగట్టారు. సామాజిక ప్రగతి ఇండెక్స్లో 57.9 స్కోర్తో ఆదిలాబాద్ జిల్లా అత్యుత్తమ స్థానంలో నిలిచింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ కాకతీయ పథకం అద్భుతమే
సృష్టించింది. రాష్ట్రంలో భూగర్భ జలాలు పుష్కలంగా లభించేందుకు ఈ పథకం ఇతోధికంగా తోడ్పడిందని నివేదిక కితాబిచ్చింది. నివేదికలోని అన్ని అంశాలకు సున్నా నుంచి వంద రేటింగ్ ఇచ్చారు. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ టాప్లో నిలిచింది. రాష్ట్రంలో హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మాత్రమే భూగర్భ జలాలను పరిమితికి మించి తోడేస్తున్నారని, మిగతా 31 జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉన్నదని పేర్కొన్నది. ఇందుకు మిషన్ కాకతీయ పథకం అద్భుతంగా తోడ్పడిందని, ఇతర రాష్ర్టాలు కూడా ఇలాంటి పథకాలను అమలుచేయాలని సూచించింది.
వందశాతం ఇండ్లకు నల్లా నీరు
దేశంలో వందశాతం గృహాలకు సురక్షిత తాగునీరు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మన రాష్ట్రంతోపాటు హర్యానా, గోవా, అండమాన్-నికోబార్, దాద్రానగర్-హవేలీ, డామన్-డయ్యూ మాత్రమే ఈ ఘనత సాధించాయని సామాజిక ప్రగతి ఇండెక్స్లో ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కూడా వెనుకబడే ఉన్నదని కుండబద్దలు కొట్టింది. రాజస్థాన్, బెంగాల్, జార్ఖండ్తోపాటు డబుల్ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో 30 శాతం ఇండ్లకు కూడా నల్లా నీరు అందటం లేదని పేర్కొన్నది. గ్రామీణ ప్రాంతాల క్యాటగిరీలో రాష్ట్రంలోని వరంగల్ రూరల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతి ఇంటికి నల్లాద్వారా సురక్షిత తాగునీరు అందిస్తున్నట్టు తేల్చింది.
పక్కా ఇండ్లలో మనమే బెస్ట్
ప్రజలందరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వటంలో పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణే నంబర్వన్గా నిలిచింది. ఈ అంశంలో జాతీయ సగటు 58.47 ఉండగా, తెలంగాణ సగటు ఏకంగా 85.49 ఉండటం విశేషం. తెలంగాణ కంటే ముందు చండీగఢ్, గోవా మాత్రమే ఉన్నాయి. జిల్లాలావారీగా చూస్తే ప్రజలకు అత్యధికంగా పక్కా ఇండ్లు నిర్మించిన జిల్లాల్లో హైదరాబాద్ దేశంలో టాప్లో నిలిచింది.
శుద్ధ ఇంధనంలో టాప్లో తెలంగాణ
వంటకోసం శుద్ధ ఇంధనం వాడటంలో కూడా మన రాష్ట్రం ఢిల్లీ, గోవా, చండీగఢ్, పుదుచ్చేరితో కలిసి మొదటిస్థానంలో నిలించింది. అ అంశంలో జాతీయ సగటు 64.18 ఉండగా, తెలంగాణలో 90 శాతానికిపైగా గృహాల్లో శుద్ధ ఇంధనాన్ని వాడుతున్నారు. జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్ 94.76 పాయింట్లతో దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో మేడ్చల్ నిలిచాయి.