హైదరాబాద్ : న్యూయార్క్ నగరంలో, లండన్లో, పారిస్లో కరెంట్ పోవచ్చు కానీ, హైదరాబాద్లో మాత్రం కరెంట్ పోదుపోదు అని మనవి చేస్తున్నాను అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 24 గంటల పాటు ఒక్క క్షణం కూడా కరెంట్ పోని పరిస్థితి కల్పించుకున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు. మైండ్ స్పేస్ – శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
గతంలో హైదరాబాద్ నగరం గొప్పగా ముందుకు పోలేదు. సమైక్య పాలకుల వల్ల చాలా బాధలు అనుభవించాం. మాకు కరెంట్ ఇవ్వండి, సరిపోవడం లేదు అని వర్కర్లు బాధపడ్డారు. వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతాం అని పారిశ్రామిక వేత్తలు ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేశారు. కానీ 24 గంటల పాటు ఒక్క క్షణం కూడా కరెంట్ పోని పరిస్థితి కల్పించుకున్నాం. నేనే స్వయంగా పర్యవేక్షించి, పట్టుబట్టి హైదరాబాద్ను పవర్ ఐలాండ్గా మార్చాం. పవర్ ఐలాండ్ అంటే రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ స్టేషన్లతోని, స్టేట్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్తోని, అలాగే భారతదేశ ఎలక్ట్రిక్ గ్రిడ్తోని కూడా హైదరాబాద్ నగరం పవర్ సెక్టార్లో అనుసంధానం అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే న్యూయార్క్ నగరంలో, లండన్లో, పారిస్లో కరెంట్ పోవచ్చు కానీ, హైదరాబాద్లో మాత్రం కరెంట్ పోదుపోదు అని మనవి చేస్తున్నాను. ఇటువంటి అద్భుతమైన నగరంగా రూపుదాల్చుతున్నాం కాబట్టి చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 500 గొప్ప గొప్ప పరిశ్రమలు మన హైదరాబాద్లో కొలువుదీరుతున్నాయని తెలిపారు.
హైదరాబాద్ సుప్రసిద్ధమైన నగరం. ఒక సందర్భంలో దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా వైశాల్యంలో, జనాభాలో పెద్దదిగా ఉన్న నగరం హైదరాబాద్. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. హైదరాబాద్ నగరంలో చెన్నై కంటే దేశంలోని అనేక ఇతర నగరాల కంటే ముందుగా 1912లోనే ఎలక్ట్రిసిటీ వచ్చిన నగరం. మనకు 1912లో కరెంట్ వస్తే చెన్నై నగరానికి 1927లో అక్కడ కరెంట్ రావడం జరిగింది. చరిత్రలో నిజమైన కాస్మోపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను, కులాలను, మతాలను, ప్రాంతాలను, జాతులను అందర్నీ అక్కున చేర్చుకోని అద్భుతమైనటువంటి విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ ఈ రోజు ఎయిర్పోర్టు కనెక్టివిటీ కోసం మెట్రోకు శంకుస్థాపనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు కేసీఆర్.