హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఐటీఐఆర్ను రద్దు చేశామని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ పేర్కొనటం సిగ్గుచేటని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణపై కేంద్రం అత్యంత కక్షపూరితంగా వ్యవహరిసున్నందనటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి లేదని తెలిపారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణభవన్లో ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ పరిశ్రమ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని 2008 లోనే దేశం గుర్తించిందని పేర్కొన్నారు.
ఐటీఐఆర్ స్థాపన కోసం 2010లో 46 వేల ఎకరాలు కేటాయించాలని కేంద్రం సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. ఐటీఐఆర్ కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న తెలంగాణ యువత ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ ఐటీ రంగ పురోగతిని చూసి కేంద్రం ఓర్వలేకపోతున్నదని, బెంగళూరును దాటిపోతుందనే అక్కసు కేంద్రానికి ఉన్నదని ఐటీఐఆర్ రద్దుతో స్పష్టమైందన్నారు. కేంద్రం ఇటీవల దేశవ్యాప్తంగా 25 సాఫ్ట్వేర్ పార్కులు కేటాయిస్తే హైదరాబాద్కు ఒక్కటీ ఇవ్వలేదని మండిపడ్డారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ను ఇటీవలే ప్రారంభించామని, చాలామంది సహచర ఎంపీలు టీ-హబ్ను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. అన్ని రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని తెలిపారు. జీడీపీలో కేంద్రం 89.6 శాతానికి మించి అప్పులు చేసిందని వెల్లడించారు. ప్రధాన్మంత్రి అవాస్ యోజన కోసం రూ.7 వేల కోట్లు, నీటిపారుదల శాఖలో దీర్ఘకాలిక రుణం రూ.40 వేల కోట్లు ఇలా అనేక రంగాల్లో కేంద్రం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించటం లేదని కాగ్ తప్పుపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
అన్ని రంగాల ప్రగతి కళ్లముందు కనిపిస్తుంటే కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి వ్యవహారం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు.
రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ చెప్పారు. రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అద్భుతంగా అమలవుతుంటే కేంద్రం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు 16 ప్రత్యేక బృందాలను రాష్ర్టానికి పంపిందని మండిపడ్డారు. ధరలు తగ్గించాలని తాము కోరితే సస్పెండ్ చేసిన దుర్మార్గం కేంద్రానిదన్నారు. తెలంగాణ ప్రజలు ముమ్మాటికీ సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని, బీజేపీ, కాంగ్రెస్ పాచికలు పారవని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఎవరూ ఆపలేరని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతుంటే ప్రత్యేకించి భద్రాచలాన్ని వరద ముంచెత్తితే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అండగా నిలిచారని, రూ.1000 కోట్లను కేటాయించి శాశ్వత ప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో వరదల వల్ల రూ.1400 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రం సహాయం చేయాలని సీఎం కేసీఆర్ కోరితే 14 పైసలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.