హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ రెండు అత్యంత కీలకమైన వ్యవసాయ సదస్సులకు వేదికగా మారింది. ఈనెల 20 నుంచి 22 వరకు రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో కూరగాయల సాగుపై అఖిల భారత సమన్వయ సదస్సు, ఎన్టీఆర్ స్టేడియంలో అత్యంత పెద్ద అగ్రి షో జరుగనున్నాయి. రాజేంద్రనగర్లో కూరగాయ పంటలపై అఖిల భారత సమన్వయ పరిశోధన పథకంపై సమావేశాలను భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్ సంజయ్కుమార్సింగ్ ప్రారంభించనున్నారు. వివిధ దేశాల శాస్త్రవేత్తలతోపాటు దేశంలోని అన్ని ఉద్యాన విశ్వవిద్యాలయాలు కూరగాయల విత్తనోత్పత్తిపై చేసిన పరిశోధనలను వెల్లడించనున్నారు.
300 మంది శాస్త్రవేత్తలు ఒకే దగ్గర సమావేశమై, భవిష్యత్తులో దేశంలో కూరగాయల దిగుబడులను పెంచడానికి అనుసరించాల్సిన విధానాలు వెల్లడించనున్నారు. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా రైతుబడి ఆధ్వర్యంలో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్ జరుగనున్నది. వివిధ రాష్ర్టాల నుంచి 3వేల మంది రైతులు, వివిధ వ్యవసాయ పరికరాల ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారని రైతుబడి నిర్వాహకులు జూలకంటి రాజేందర్రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్ను శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. నూతన యంత్రాలు, ఏఐ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి ఎన్నో ప్రదర్శనకు వచ్చినట్టు చెప్పారు. సందర్శకులు www.rbagrishow.com ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని, నేరుగా హాజరుకావచ్చని వెల్లడించారు.