కంటోన్మెంట్/మారేడ్పల్లి/బొల్లారం/సికింద్రాబాద్, ఫిబ్రవరి 23: ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు ఆధ్వర్యంలో పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం ఆమె మృతదేహాన్ని కార్ఖానాలోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు. రాజకీయ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భౌతికకాయానికి నివాళి అర్పించిన అనంతరం.. మారేడ్పల్లి శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. కంటోన్మెంట్బో ర్డు, రాష్ట్ర సర్కారు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాయి. పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. నందిత అక్క కుమారుడు పీయూష్ రాఘవ ఆమె చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహించారు.
యువ ఎమ్మెల్యే లాస్య నందితతో కాలం పగబట్టినట్టుగా వ్యవహరించింది. కొంతకాలంగా మృత్యువు వెంటాడుతూ వచ్చింది. ఏడాది క్రితమే ఆమె తండ్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతిచెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత బీఆర్ఎస్ తరఫున కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లాస్య నందితను ఇటీవల ప్రమాదాలు వెంటాడాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం గత డిసెంబర్లో సికింద్రాబాద్లో ఒక కార్యక్రమానికి హాజరైన ఆమె లిఫ్టులో ఇరుక్కుపోయారు. ఓవర్లోడ్ కారణంగా లిఫ్టు కిందకి పడిపోవడంతో లాస్య నందిత మూడుగంటలపాటు లిఫ్టులోను ఉండిపోయారు. అతికష్టంగా ఆమెను లిఫ్టు నుంచి బయటకు తీసి రక్షించారు. ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ నుంచి తిరిగి వస్తుండగా చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. తాజాగా శుక్రవారం జరిగిన ప్రమాదం ఆమె ప్రాణాలనే బలితీసుకున్నది.