హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): అంతరిక్ష ప్రయోగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతున్నది. ఆకాశమే హద్దుగా ఇక్కడి స్టార్టప్స్ దూసుకుపోతున్నాయి. స్కైరూట్ స్టార్టప్ ఈ నెల 18న చిన్న రాకెట్ను నింగిలోకి విజయవంతంగా పంపించి సత్తాచాటింది. శనివారం మరో హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ధ్రువ స్పేస్ చిన్న ఉపగ్రహాలను నింగిలోకి పంపించేందుకు సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ధావన్ స్పేస్సెంటర్(షార్)లో పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ద్వారా ఒకేసారి 9 ఉపగ్రహాలను ఇస్రో పంపుతుండగా, రెండు చిన్న ఉపగ్రహాలు థైబోల్ట్-1, థైబోల్ట్-2 ధ్రువ తయారుచేసినవే. అంతరిక్ష రంగ పరిశోధనలను, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పేస్టెక్ ఫ్రేమ్వర్క్ను అమలుచేస్తున్నది.
చిన్న ఉపగ్రహాల తయారీలో దేశంలోనే తొలి ప్రైవేటు కంపెనీగా ధ్రువ స్పేస్కు గుర్తింపు ఉన్నది. బేగంపేట, మేడ్చల్ కేంద్రంగా పదేండ్లుగా ఈ సంస్థ అంతరిక్ష ప్రయోగాలను చేపట్టింది. శనివారం ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలో హైదరాబాద్ కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడుతుంది. అంతరిక్ష ప్రయోగాల్లో హైదరాబాద్కు మరింత పేరు ప్రఖ్యాతులు దక్కుతాయి. ‘దేశంలోనే ప్రైవేట్ పరిశ్రమల నేతృత్వంలో అంతరిక్ష విప్లవానికి నాంది పలికాం. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఇస్రో, ఇన్స్పేస్, న్యూ స్పేస్ఇండియా సంస్థలు ప్రయోగాలకు సహకరిస్తున్నాయి’ అని ధ్రువ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సంజయ్ నెక్కంటి తెలిపారు.