కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరపడుతున్న కొద్ది బీజేపీ డ్రామాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్ని డ్రామాలాడిన ప్రజలు సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాల వైపే ఉన్నారని సర్వేలు చెబుతున్నాయని వెల్లడించారు. హుజూరాబాద్లో స్థానిక నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈటల రాజేందర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యాడనడానికి స్పష్టత వచ్చిందన్నారు. గత్యంతరం లేకే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఈటల ఒప్పుకున్నాడని, ఈ వ్యాఖ్యలను ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆమోదిస్తారా అని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి ఎన్నో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఈటల.. ఇవన్నీ అవసరమా, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కేబినెట్లో ఉండగానే రేవంత్రెడ్డితో కుమ్మక్కయింది నిజం కాదా అని ప్రశ్నించారు. వ్యక్తిగత స్వార్ధానికి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఈటల బద్నాం చేయాలని చూశాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. హుజూరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.