వీణవంక, ఆగస్టు 13 : అది ఓ మారుమూల గ్రామం. నిన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ, ఇప్పుడు హిమ్మత్నగర్ వార్తల్లో కెక్కింది. విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును టీఆర్ఎస్ హజూరాబాద్ అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఆ ఊరు మురిసిపోతున్నది. గ్రామంలో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. ఎవరూ ఊహించని విధంగా తమ ఊరి పేదింటి బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో గ్రామస్తులు సంబురాలు చేసుకుంటున్నారు. ఓ పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడికి సరైన గుర్తింపు దక్కిందని సంతోష పడుతున్నారు. ఈ అవకాశం రావడం తమ ఊరి అదృష్టమని సంబురపడుతున్నారు. కులమతాలకతీతంగా ఒక్కటై శ్రీనివాస్ను గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీనన్న పోరాడిండు. ఉస్మానియా యూనివర్సీటీలో ఉన్నపుడు ఉద్యమంలో పాల్గొని ఎన్నో దెబ్బలు తిన్నడు. అలాంటి యువనాయకుడిని సీఎం కేసీఆర్ గుర్తించిండు. హుజూరాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉన్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో యువకులందరు శ్రీనన్న వెంటే ఉన్నరు. అన్నను గెలిపించి సీఎం కేసీఆర్కు గిఫ్ట్ ఇస్తం. మా గ్రామంలో అందరు ఒక పండుగలాగా సంబరాలు చేసుకుంటున్నరు. – కర్ణకంటి భాస్కర్రెడ్డి, హిమ్మత్నగర్
శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో బాగ కష్టపడ్డడు. ఇప్పుడు సీఎం సార్ గుర్తించి మంచి అవకాశం ఇచ్చిండు. కులమతాలకు సంబంధం లేకుండా శ్రీనివాస్ గెలుపు కోసం కష్టపడుతం. కేసీఆర్ సారు నా బిడ్డకు షాదీముబారక్ కింద లక్ష రూపాయలిచ్చిండు. శ్రీనివాస్ను గెలిపించి ఆయన రుణం తీర్సుకుంట. అందరం కలిసికట్టుగా పనిచేస్తం. నియోజకవర్గంలో 60 వేల మెజార్టీతో గెలిపించుకుంటం. టీఆర్ఎస్ పార్టీ వస్తే ఎన్నో అభివృద్ధి పనులు అయితయి. కష్టపడెటోళ్లకు మంచి రోజులు అచ్చినయని అనుకుంటన్నం. – ఎండీ అహ్మద్, హిమ్మత్నగర్
మా శీను చిన్నప్పటిసంది మస్తు కష్ట పడ్డడు. తల్లిదండ్రులతోటి పనుల కు కూడా పోయెటోడు. ఎప్పుడు చూసినా తెలంగాణ ముచ్చట చెప్పెటోడు. మా శీనుకు ఎమ్మెల్యే టికెట్ అత్తదని అనుకోలె. ఊళ్లె అందరూ సంబురపడుతున్రు. మేమందరం కలిసి మాట్లాడు కున్నం. మా ఊరి బిడ్డను ఎట్లయినా జేసి గెలిపిస్తం. మావోళ్లందరికీ చెప్తం. – గెల్లు రాజమ్మ, హిమ్మత్నగర్