హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 13 : బీజే పీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒక మోసగాడని, ఆయన అరాచకాలపై 50 వేల కరపత్రాలను హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పంచి, ఆయన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఈటల దళిత బాధితుల సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు తిప్పారపు సంపత్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం నాయకులతో కలిసి సంపత్.. ఈటల మోసాలపై రూపొందించిన కరపత్రాలను విడుదలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో తమలాంటి కుటుంబాలను ఎంతో మందిని చంపించడం, కొట్టించడం, కేసులు బనాయించడం వంటివి చేశారని ఆరోపించారు.
ఊరూరా ఈటల బాధితులు ఉన్నారని, ఈ ఎన్నికల్లో ఆయన గ్రామాలకు వెళ్తే చెప్పులతో కొడతారని స్పష్టం చేశారు. ఈటల అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని అడిగిన తనపై సరిగా ఐదేండ్ల కిందట ఇదే రోజు (2018 అక్టోబర్ 13)న అనేక కేసులు పెట్టి జైలుకు పంపించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి సారి అసెంబ్లీ ఎన్నికల్లో మోసపు మాటలు చెప్తూ గెలుస్తున్నారని, గత ఉప ఎన్నికల్లోనూ అనేక దొంగ మాటలు చెప్పి గెలిచాడని ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాడుతానని చెప్పిన ఈటల ఢిల్లీలో ఆయన రాజకీయ మనుగడ కోసం పోరాడుతున్నాడని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజలను మోసం చేసి గెలవడం అలవాటుగా మారిందని, మళ్లీ ఏ మొఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతాడని ప్రశ్నించారు. ఈటలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమావేశంలో ఈటల దళిత బాధితుల సంఘం హైకోర్టు లీగల్ అడ్వైజర్ ఇంద్రానిదేవి, ఉపాధ్యక్షుడు మేకల సుధాకర్, ప్రధాన కార్యదర్శి నమిండ్ల రాజేశ్వర్, అధికార ప్రతినిధి కదిరె రమేశ్, కార్యదర్శి దాట్ల ప్రవీణ్, సహాయ కార్యదర్శి చల్లూరి రాహుల్ పాల్గొన్నారు.