హైదరాబాద్, సెప్టెంబర్ 4, (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. ఓపక్క కరోనా మూడో వేవ్ తరుముకొస్తుండటం, ఇంకోపక్క పండుగల సీజన్తోపాటు భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉపఎన్నిక మరికొంత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణపై అన్ని రాష్ర్టాల అభిప్రాయాలు తీసుకొన్న కేంద్ర ఎన్నికల సంఘం కూడా సూత్రప్రాయంగా ఇదే విషయాన్ని వెల్లడించింది. శనివారం పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదలచేసిన సీఈసీ హుజూరాబాద్తోపాటు మరో 12 రాష్ర్టాల్లోని ఉప ఎన్నికలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
పండుగల తర్వాతే..
వివిధ రాష్ర్టాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. పండుగల సీజన్ కూడా మొదలైంది. వారంరోజుల్లో వినాయకచవితి రాబోతున్నది. ఆ వెంటనే బతుకమ్మ, అక్టోబర్ 15న దసరా పండుగ రానున్నది. నవంబర్ 4 న దీపావళి పర్వదినం ఉన్నది. పెద్ద ఎత్తున ప్రజలు సామూహికంగా జరుపుకొనే పండుగలివి. మరోవైపు రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అధికార యంత్రాంగం మొత్తం ఈ అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక నిర్వహిస్తే అధికార యంత్రాంగానికి నిర్వహణ కష్టతరమవుతుంది. ఉప ఎన్నికల నిర్వహణపై ఈ నెల ఒకటో తేదీన రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఈసీ సమావేశమైనప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ర్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవే అభిప్రాయాలను వెలిబుచ్చాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో ఉప ఎన్నికలపై ఈసీ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలకోసం ప్రజలందరిని రిస్క్లో పెట్టేందుకు సిద్ధంగాలేమని ఈసీ పరోక్షంగా వెల్లడించింది. ఈ క్రమంలో దీపావళి తరువాతే నవంబర్లో షెడ్యూలు విడుదలచేసే అవకాశం ఉన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, దాద్రానగర్ హవేలీ, డామన్, డయ్యూలోని 31 శాసనసభ, మూడు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్ స్థానం కూడా ఇందులో ఉన్నది. ఈసీ సూచన ప్రకారం పండుగల తర్వాతే ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యూపీ ఎన్నికలతోనా?
ఉప ఎన్నికలకు దీపావళి తరువాత షెడ్యూలు విడుదల చేస్తే నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన, ఉపసంహరణ తరువాత ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ పూర్తి కావడానికి కనీసం నెలరోజుల సమయమైనా పడుతుంది. ఒకవేళ పండుగల తర్వాత ఉప ఎన్నికలు జరుపాలంటే పోలింగ్ డిసెంబర్లో నిర్వహించాల్సి ఉంటుంది. హుజూరాబాద్తోపాటు 31 అసెంబ్లీ సీట్లకు, మూడు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలంటే 12 రాష్ర్టాలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. వీటిలో ఉత్తరప్రదేశ్లో కూడా 8 స్థానాలు కూడా ఉన్నాయి. కానీ, యూపీ అసెంబ్లీకి 2022 జనవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఆ ఎనిమిది స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించినా నెలరోజుల వ్యవధిలోనే మళ్లీ ఎన్నికలు జరపాల్సిఉంటుంది. కాబట్టి యూపీలోని ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిపే అవకాశమే లేదు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న మిగతా ఖాళీలకు సైతం యూపీ ఎన్నికలతోపాటు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తే హుజూరాబాద్ ఎన్నిక జనవరి వరకు జరుగకపోవచ్చు. ఈ పరిస్థితులను బట్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక డిసెంబర్ లేదా జనవరి మాసాల్లో అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.