భైంసా, జనవరి 19: దళితబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిర్మల్ జిల్లా భైంసాలో ఓ లబ్ధిదారుడు నిరాహార దీక్ష చేపట్టాడు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద లబ్ధిదారు కొత్తూర్ శంకర్ చేపట్టిన దీక్షలో అర్ధనగ్నంగా కూర్చొని నిరసన తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రెండో విడత కింద దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేసిందని ఆయన గుర్తుచేశారు. ముథోల్ నియోజకవర్గంలో 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారని, ఇందుకు సంబంధించిన డబ్బులను ఇప్పటికే కలెక్టర్ ఖాతాలో వేశారని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా గతంలో ఖాతాల్లో నగదు వేసే ప్రక్రియ నిలిచిపోయిందని, వెంటనే ఆ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే దళితులంతా ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని హెచ్చరించారు. ఈ నిరసనకు అన్నాబావు సాటే సంఘం జిల్లా అధ్యక్షుడు ఉత్తం బాలేరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సుంకెట మహేశ్, మోచీ సంఘం జిల్లా అధ్యక్షుడు సాయినాథ్ మద్దతు తెలిపారు.