హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు నిర్దేశించిన బ్యాంకు లింకేజీ రుణాలను వందశాతం పంపిణీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు. బ్యాంకు లింకేజీ రుణాలపై గురువారం ఆయన అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, అదనపు డీఆర్డీవోలు, డీపీఎంలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇప్పటివరకు 60 శాతమే బ్యాంకు లింకేజీ పూర్తయిందని, మిగిలిన 40 శాతం లక్ష్యాన్ని నెలరోజుల్లోగా సాధించాలని స్పష్టం చేశారు. అర్హులైన సంఘాలన్నింటికీ బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని సూచించారు. రుణాల ను సంఘాలు సద్వినియోగం చేసుకున్నాయో, లేదో తెలుసుకొనేందుకు అసెట్స్ను తనిఖీ చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల డాటా నమోదుకు ప్రత్యేక యాప్ను నెలాఖరుకు తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ హనుమంతరావు, సెర్ప్ డైరెక్టర్ వైఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.