నల్లగొండ : 1990 బ్యాచ్ పోలీస్ అధికారులు మానవత్వంతో తోటి బ్యాచ్ మేట్ కుటుంబానికి అండగా నిలిచి ధైర్యాన్ని ఇవ్వడం ఎంతో అభినందనీయమని డీఐజీ ఏవీ రంగనాధ్ అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో 1990 బ్యాచ్ కు చెందిన పోలా ప్రభాకర్ మునుగోడు పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, వారి కుటుంబానికి 1990 బ్యాచ్ మేట్స్ అందరూ కలిసి లక్ష రూపాయలను ప్రభాకర్ కుటుంబానికి అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం నిరంతర సవాళ్లతో కూడుకున్నదన్నారు. ఎన్నో రకాల వత్తిడుల మధ్య విధి నిర్వహణ చేస్తూ ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారన్నారు.
అనారోగ్య సమస్యలతో మృతి చెందిన ఏఎస్ఐ ప్రభాకర్ కుటుంబానికి తోటి బ్యాచ్ మేట్స్ అందరూ మానవత్వంతో ఆయన కుటుంబానికి అండగా నిలవడం ఎంతో గర్వకారణమని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపి రెడ్డి మాట్లాడుతూ.. పోలీసుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో పోలీసుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్మద, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, 1990 బ్యాచ్ కు చెందిన బి. జయరాజ్, యాదగిరి, సోమయ్య, జలీల్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.