Minister KTR | మానవీయ కోణం తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్పై చర్చల సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమంపై పలువురు సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దేశంలో ఉన్న 28 రాష్ట్రాలున్నాయ్. ఏ ఒక్క రాష్ట్రంలో 16వేల అక్రిడిటేషన్ కార్డులున్న చరిత్ర ఉన్నదా? గుజరాత్ రాష్ట్రంలో 3వేల అక్రిడిటేషన్ కార్డులున్నయ్. భారతదేశంలో ఎక్కడా రెండు, మూడువేలకు మించి అక్రిడిటేషన్ జర్నలిస్టులు లేరు.
మనకంటే నాలుగైదు రెట్లు పెద్దవైన రాష్ట్రాల్లోనూ ఈ ఇంత పెద్ద ఎత్తున అక్రిడిటేషన్లు కార్డుల సంఖ్య లేదు. ఉద్యమంతో తమనో కలిసి నడిచిన వారు కలం వీరులు. వారి యాజమాన్యాలు మాకు అనుకూలంగా లేకపోయినా కలిసిన నడిచిన వ్యక్తులు జర్నలిస్టులు. వారిపై ప్రేమతో జరల్నిస్టుల సంక్షేమానికి రూ.100కోట్లు కేటాయించిన దాఖలు భారతదేశంలో ఉన్నాయా? 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడా? సీఎం కేసీఆర్ తప్ప’ అని కేటీఆర్ ప్రశ్నించారు. చేసిన పనులు చెప్పకుండా కేవలం ఉద్దేశపూర్వకంగా, అసలేమీ జరుగుతలేదన్నట్లు మాట్లాడడం భావ్యం కాదన్నారు.
‘తెలంగాణ మీడియా అకాడమీకి రూ.40కోట్లు మంజూరు చేయడం జరిగింది. జర్నలిస్టు ఎవరైనా మరణిస్తే.. ఆయా కుటుంబాలకు సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేయడం జరుగుతున్నది. అనారోగ్యం, ప్రమాదాల్లో గాయపడి విధులు నిర్వర్తించలేని స్థితిలో దివ్యాంగులైతే.. అలాంటి వారికి రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి సంవత్సరానికి రూ.3వేల చొప్పున ఐదుసంవత్సరాల వరకు పెన్షన్ అందిస్తూ వస్తున్నాం. ఇద్దరు పిల్లలకు నెలకు రూ.వెయ్యితో ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు ట్యూషన్ ఫీజు చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే ఉన్నత విద్య అభ్యసించేందుకు రూ.లక్ష, విదేశాల్లో గుర్తించబడ్డ జర్నలిజం కోర్సులు చదివేందుకు వెళ్లడానికి రూ.5లక్షల వరకు సంక్షేమ నిధి నుంచి కేటాయిస్తున్నాం. జర్నలిస్టులు కొవిడ్ సమయంలో ధైర్యంగా వృత్తి ధర్మాన్ని నెరవేర్చారు. అందరు ఇండ్లల్లో ఉన్నా.. విలేకరులు బయటకు వెళ్లి వార్తలు సేకరించారు. కొవిడ్ సమయంలో అనారోగ్యానికి గురైన, మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.6.80కోట్లు అందజేశాం’ అని వివరించారు.
‘భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని లేనివిధంగా ప్రైవేటు స్కూల్ టీచర్లను ఆదుకున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. మానవీయత అనేది సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే ట్యాగ్లైన్. మానవీయ కోణం అనేది మేం అవలంభిస్తున్న విధానం. జర్నలిస్టులైనా, లాయర్లు అయినా, ప్రైవేటు టీచర్లయినా వారిని మానవీయంగా ఆదుకున్నాం. ఇక్కడ పని చేస్తున్న కూలీలు స్వస్థలాలకు రైళ్లలో వెళ్లేందుకు దిక్కులోని స్థితిలో ఉంటే చార్జీల పేరుతో వారి తోలు తీసింది బీజేపీ పార్టీ. ఇవన్నీ వాస్తవలు. వీటిని ఎవరూ మరిచిపోలేదు. ఇప్పటి వరకు జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి 5509 మంది జర్నలిస్టులకు మీడియా అకాడమీ నుంచి రూ.17.60కోట్ల ఆర్థిక సాయం అందించాం. రూ.15కోట్లతో బ్రహ్మాండంగా మీడియా అకాడమీ భవనం నిర్మించాం.
రాబోయే నెల రోజుల్లో పూర్తవుతుంది. జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు, ఎంసీజే కోర్సు చేయదలుచుకున్న వారికి తెలుగు యూనివర్సిటీలో ఫీజులో 25శాతం రాయితీ ఇస్తున్నాం. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో సురవరం ప్రతాప్రెడ్డి పేరుమీదున్న ఆడిటోరియాన్ని పునరుద్ధరించేందుకు రూ.2.30కోట్లు కేటాయించాం. సోమాజిగూడ ప్రెస్క్లబ్ కోసం రూ.30లక్షలు కేటాయించాం. చాలా జిల్లాకేంద్రాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఇవ్వకపోతే.. ఇచ్చే బాధ్యత మాది. 16,337 అక్రిడిటేట్ జర్నలిస్టులతో పాటు కుటుంబ సభ్యులు కలుపుకొని మొత్తం 48,692 మందికి హెల్త్ కార్డులు జారీ చేయడం జరిగింది. మొత్తం 65,029 మందికి హెల్త్కార్డులు జారీ చేయడంతో పాటు ఆపరేషన్లు, చికిత్సల కోసం 2015 నుంచి ఇప్పటి వరకు రూ.33.44కోట్లు ఖర్చు చేసింది. ఇంకా మెరుగైన చేయాలని సూచనలు ఇవ్వాలి, కానీ ఏం జరుగడం లేదని అభాండాలు వేసేవిధంగా మాట్లాడడం సరికాదు’ అంటూ హితవు పలికారు.