హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో వృథాగా ఉన్న, కబ్జాకు గురవుతున్న, చెత్తకుప్పలుగా వినియోగిస్తున్న చిన్నచిన్న ప్రభుత్వ స్థలాలను ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర మున్సిపల్శాఖ నిర్ణయించింది. వృథాగా ఉన్న ఆయా ప్రభుత్వ స్థలాలను ఆట స్థలాలు, గ్రంథాలయాలు, మూత్రశాలలు, చిన్నపాటి మార్కెట్లు, కమ్యూనిటీ హాళ్లుగా మార్చనున్నారు. ఇందుకోసం మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖతో హైదరాబాద్ అర్బన్ల్యాబ్ (హెచ్యూఎల్) ఫౌండేషన్ సంస్థ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో శనివారం ఒప్పందం కుదుర్చుకున్నది.
స్థానికులతో సంప్రదించిన అనంతరం అర్బన్ ల్యాబ్ ఫౌండేషన్ సంస్థ ఆయా స్థలాలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో డిజైన్ చేయనున్నది. ఈ సంస్థ స్థానికులు, విద్యార్థులు, స్వచ్ఛందసంస్థలు, ఆర్కిటెక్చర్ విద్యార్థులతో కలిసి పనిచేయనున్నది. ఈ కార్యక్రమానికి అర్బన్ ఆక్యుపంక్చర్గా పేరు పెట్టారు. వ్యర్థాలకు నిలయాలుగా మారిన, కబ్జాకు గురైన స్థలాల వివరాలు, వృధాగా ఉన్న ప్రభుత్వ స్థలాల వివరాలను స్థానిక జీహెచ్ఎంసీ అధికారులతోపాటు జోనల్, డిప్యూటీ కమిషనర్లకు నేరుగా సమాచారం ఇవ్వాలని మున్సిపల్శాఖ అధికారులు సూచించారు.
ట్విట్టర్ ద్వారా మున్సిపల్శాఖ, జీహెచ్ఎంసీలకు సమాచారం చేరవేయవచ్చని పేర్కొన్నారు. ఒప్పంద కార్యక్రమంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.