అయిజ/అమరచింత/శ్రీశైలం, సెప్టెంబర్ 16 : ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద హోరెత్తుతున్నది. జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద వచ్చి చేరుతున్నది. శుక్రవారం ఇన్ఫ్లో 47,049 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 46,620 క్యూసెక్కులుగా నమోదైంది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో 50,824 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 50,324 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2.66 లక్షల క్యూసెక్కులు నమోదు కాగా డ్యాం 43 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అవుట్ఫ్లో 2,76,163 క్యూసెక్కులుగా నమోదైంది. సుంకేసుల డ్యాంకు వరద నమోదవుతున్నది. శ్రీశైల జలాశయానికి ఇన్ఫ్లో 3,10,689 క్యూసెక్కులు నమోదు కాగా డ్యాం 10 గేట్లను అధికారులు 12 అడుగుల ఎత్తుకు తెరిచి సాగర్కు నీటిని విడుదల చేశారు. అవుట్ఫ్లో 3,68,338 నమోదైనట్టు అధికారులు తెలిపారు.