నిజామాబాద్: ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 68,250 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 19 గేట్లు ఎత్తి 74,880 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం మరో 7500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకుగాను.. ప్రస్తుతం 1090.8 అడుగుల నీరు ఉన్నది. సాగర్ నీటినిల్వ సామర్థం 90 టీఎంసీలు. ప్రస్తుతం 89.21 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
నిజాంసాగర్ ప్రాజెక్టలోకి భారీగా వరదవ వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి 3175 క్యూసెక్కుల నీరు వస్తున్నది. జలాశయం నీటినిల్వ 17.802 టీఎంసీలు.. ప్రస్తుతం 10.644 టీఎంసీలకు నిల్వ చేరింది.
ఇక నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయంలోకి 44,865 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఐదు గేట్లు ఎత్తి 53,139 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయిన నీటిమట్టం 700 అడుగులు. ప్రస్తుతం 697.7 అడుగులు ఉన్నది.