Revanth Reddy | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): హిట్లర్ నియంత.. అంత కు మించిన క్రూరుడు.. మహా మానవ హననం కోసం తపించిన రక్త పిపాసి. సోవియట్ యూనియన్ చేతిలో ఓటమి తప్పదని అర్థమైన మరుక్షణమే తాను పాలిస్తున్న జర్మనీలోని పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను ధ్వంసం చేయాలని తన అనుయాయులను ఆదేశించిన విధ్వంసకారుడు! అలాంటి హిట్లర్నే ఆదర్శంగా తీసుకొని హైడ్రా ను ఏర్పాటుచేశామని గాంధీగిరి పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించుకున్నారు. అడాల్ఫ్ హిట్లరే తనకు స్ఫూర్తి అని చాటింపు వేశారు. ఇంతకూ ఆయన యుద్ధ బీభత్సం ఎక్కడ కోరుకుంటున్నరు? తానే పరిపాలిస్తున్న రాష్ట్ర రాజధాని మహానగరంలో! రేవంత్రెడ్డి నియంత హిట్లర్ అరాచక తరహా ఆలోచనలతో ఇజ్రాయెల్ తరహా విధ్వంసం చేస్తానంటున్నది గ్రేటర్ హైదరాబాద్ నగరాన్నే. విమర్శకులు అతివాద జాతీయ పార్టీలను విమర్శించేటప్పుడు ఫాసిస్టు హిట్లర్తో పోలుస్తారు.
అంతెందుకు బీజేపీ, ఆరెస్సెస్ ఫాసిస్ట్ ధోరణి అవలంబిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సైతం పదేపదే విమర్శిస్తుంటారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారని, సమాజంలో విభజన రాజకీయాలు తీసుకొస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశంలోని స్వతంత్ర వ్యవస్థలైన మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి వాటిని ఆరెస్సెస్, బీజేపీ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ప్రజాస్వామ్య స్వభావాన్నే మార్చేశాయని ఆయన లండన్లోని చాథమ్ హౌస్లో చేసిన ప్రసంగంలో ఆరోపించారు.
దళితులు, గిరిజనులు, మైనారిటీలను భారతీయ సమాజంలో అట్టడుగునే ఉంచాలనేది వారి ఫాసిస్ట్ ఆలోచన అని, రోహిత్ వేముల, భీమా కోరెగావ్ వంటి ఘటనలు ఇందుకు నిదర్శనమని రాహుల్గాంధీ విమర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫాసిస్ట్ నియంత హిట్లర్ తనకు ఆదర్శమని, ఆయన్నే అనుకరిస్తానని ప్రకటించుకోవడం రాహుల్గాంధీని ఎదురుదెబ్బ కొట్టడమేనని, ఆయనను విమర్శించేవారికి మద్దతు ప్రకటించడమేననే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పాలిత మరో రాష్ట్రమైన కర్ణాటకలో ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆపార్టీ జాతీయ నాయకత్వంలో పెద్ద దుమారమే చెలరేగుతున్నది.
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై ఇండియా కూటమి భాగస్వామి, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా స్పందించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. మరోవైపు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ రేవంత్ యుద్ధ బీభత్స వ్యాఖ్యల మీద పదునైన విమర్శలు చేస్తున్నది. ఇది రేవంత్ అరాచక ఆలోచనలు, విద్వేష మనస్తత్వాన్ని బయట పెట్టిందని విమర్శించింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు శత్రుదేశాల దాడిలో విధ్వంసానికి గురికాగా, రేవంత్రెడ్డి మాత్రం హైదరాబాద్ నగరంలోని దిగువ మధ్య తరగతి ప్రజల నివాసాల మీద విధ్వంసం సృష్టించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇజ్రాయెల్ దేశంలో శత్రు దేశపు క్షిపణులు రణ విలయాన్ని సృష్టిస్తే.. తెలంగాణలోని రాజధాని నగరం మీద తాను స్వయంగా పంపిన బుల్డోజర్లు యుద్ధ బీభత్సం సృష్టించాయని పేర్కొంటూ.. ఈ రెండు వినాశనాల్లో ఏది గొప్పగా ఉన్నదో గూగుల్ మ్యాప్ ద్వారా పోల్చి చూసుకోవాలని రేవంత్రెడ్డి కాలర్ ఎగిరేసినట్టు చెప్పడంపై ఢిల్లీ కాంగ్రెస్ కంగుతిన్నట్టు సమాచారం. రేవంత్రెడ్డి వ్యాఖ్యల మీద సమగ్ర వివరణ ఇవ్వాలని అటు కర్ణాటక రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్ రణదీప్సింగ్ సూర్జేవాలాను, ఇటు తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీనటరాజన్ను ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
అధిష్ఠానం ఆదేశాలతో రంగంలోకి దిగిన రెండు రాష్ర్టాల దూతలు పరస్పరం చర్చించుకున్నట్టు తెలిసింది. రేవంత్రెడ్డి నియంత వ్యాఖ్యలు కేవలం రెండు రాష్ర్టాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భావజాలన్ని దెబ్బతీశాయనే అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఆయన ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేశారా? యాదృచ్ఛికంగానే ఆయన నోటి వెంట వచ్చాయో చెప్పడం కష్టమే కానీ, రేవంత్రెడ్డి రాజకీయ ప్రస్థానం తొలినాళ్లలో ఆరెస్సెస్ బావజాలంతో ప్రేరేపితమైందని, ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలతోనే అంటకాగుతున్నారని, వారి స్నేహబంధంతోనే అతివాద జాతీయ ధోరణి బయటపడిందని తెలంగాణలో చర్చ జరుగుతున్నట్టు వారి మధ్య ప్రస్తావనకు వచ్చిందని తెలిసింది.
హిట్లర్ పట్ల రేవంత్కు ఉన్న అభిమానం, ఆయనలోని సంఘ్పరివార్ పూర్వ ఆలోచనలు ఫాసిస్టు భావజాలాన్ని బయటపెట్టాయనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ గాంధీ, నెహ్రూ సిద్ధాంతం ఎత్తుకుంటే, ఆ పార్టీ సీఎం రేవంత్ హిట్లర్ సిద్ధాంతం ఎత్తుకోవడం పార్టీకి తీవ్ర నష్టమేనని వారు అధిష్ఠానానికి నివేదించినట్టు తెలిసింది. దూతల నివేదికతో అత్యవసరంగా రంగంలోకి దిగిన అధిష్ఠానం.. నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్టు సమాచారం.
సీఎం స్థాయి వ్యక్తికి కనీసం పార్టీ సైద్ధాంతిక అభిప్రాయాలు తెలియకపోతే ఎట్లా? అని అధిష్ఠానం పెద్దలు అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. పరిస్థితి చెయ్యి దాటకుండా మంత్రి శ్రీధర్బాబుకు పలు సూచనలు చేసి మీడియా ముందుకు పంపినట్టు తెలిసింది. దీంతో మీడియా ముందుకు వచ్చిన దుద్దిళ్ల దిద్దుబాటు చర్యలు ప్రారంభించినప్పటికీ, అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిందని సీనియర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్పూర్తితో హైదరాబాద్లో పేదల ఇండ్లు కూల్చేందుకు హైడ్రా తెచ్చామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పడం దిగ్భ్రాంతికరం. రేవంత్కు గతంలో సంఘ్పరివార్తో లింకులున్నాయి. ఆ ప్రభావం కూడా రేవంత్ మాటల్లో ఉన్నది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులపై ప్రజాస్వామ్య ఆలోచనలు ఉన్న పౌరులు సమీక్షించుకోవాలి. రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలకు కాంగ్రెస్ అధిష్ఠానం సమాధానం చెప్పాలి. -కేరళ మాజీ సీఎం పినరయి విజయన్